APSRTC Arranged Special Buses for Elections : ఓటు హక్కు వినియోగించుకునేందుకు వివిధ ప్రాంతాల నుంచి రాష్ట్రానికి ఓటర్లు పోటెత్తుతున్నారు. రాష్ట్ర ప్రజలు ఎక్కువగా ఉండే హైదరాబాద్ నుంచి ఓటర్లు తరలివస్తున్నారు. దీంతో మే 13 న ఓటు వేసేందుకు హైదరాబాద్ నుంచి ఏపీకి వచ్చేవారి కోసం శనివారం, ఆదివారం ప్రత్యేక బస్సులు ఏర్పాటుచేసినట్లు ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావుతెలిపారు. హైదరాబాద్ నుండి రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు రోజూ 339 సర్వీసులు నడుస్తాయని, వీటికి అదనంగా శనివారం 302, ఆదివారం 206 ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఇవాల హైదరాబాద్ నుండి ఒంగోలు 38, ఏలూరుకు 20 బస్సులు, మచిలీపట్నంకు 23, విజయవాడకు 45, గుంటూరు 18, నరసరావు పేట 26, నెల్లూరు 17, నంద్యాల 19, విశాఖపట్నం 4 ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. బెంగుళూరు నుండి రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు ఇవాల మొత్తం 323 బస్సులు, 12 వ తేదీన 269 బస్సులు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. రెగ్యులర్గా నడిచే బస్సులతో పాటు అదనంగా ఈ బస్సులను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ ప్రత్యేక బస్సుల్లో సాధారణ ఛార్జీలే వసూలు చేయనున్నట్లు వెల్లడించారు.
ప్రయాణికులతో కిక్కిరిసిన బస్టాండ్లు, రైల్వేస్టేషన్లు- 2 వేల ప్రత్యేక బస్సులు నడుపుతున్న ఆర్టీసీ
ఆర్టీసీ ఎండీకి చంద్రబాబు లేఖ :అయితే ఈనెల 13న జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో ఓటేసేందుకు వేర్వేరు ప్రాంతాల నుంచి ఏపీకి వచ్చే వారి కోసం అదనపు బస్సులు ఏర్పాటు చేయాలని తెలుగుదేశం అధినేత చంద్రబాబు ఈరోజు ఆర్టీసీ ఎండీకి లేఖ రాశారు. ఆర్టీసీ బస్సులు పెంచితే ప్రయాణ సౌకర్యంతో ఓటింగ్ శాతం పెరుగుతుందని సూచించారు. ప్రధానంగా తెలంగాణలో ఉన్న ఏపీ ఓటర్లు సొంత ప్రాంతాలకు రావడం ఇప్పటికే మొదలైందని ఇది దృష్టిలో పెట్టుకుని బస్సులను పెంచాలని చంద్రబాబు తన లేఖలో ఆర్టీసీ ఎండీని కోరారు. ఇప్పటికే హైదరాబాద్, విజయవాడ బస్టాండ్లలో రద్దీ కనిపిస్తోందన్న చంద్రబాబు అవసరమైనన్ని బస్సులు అందుబాటులో లేక ప్రయాణికులు నిరీక్షిస్తున్నారని తెలిపారు. ఈ రెండు, మూడు రోజులు అదనపు బస్సులు ఏర్పాటు చేసి ప్రయాణాలకు ఇబ్బంది లేకుండా చూడాలని సూచించారు. చంద్రబాబు లేఖ అనంతరం ఆర్టీటీ ఎండీ ద్వారకా తిరుమలరావు స్పందించటం గమనార్హం.