AP HC on Son Neglected Mother Petition : తల్లిదండ్రులు తమ బిడ్డలను అల్లారుముద్దుగా పెంచుకుంటారు. అయితే పిల్లలు మాత్రం వారిని వృద్ధాప్యంలో ఉన్నప్పుడు పట్టించుకోవడం లేదు. కానీ వాళ్లు ఇచ్చిన ఆస్తులను మాత్రం అనుభవిస్తున్నారు. తాజాగా ఇంటిని స్వాధీనం చేసుకుని కన్న తల్లినే ఇబ్బందులకు గురిచేస్తున్న కుమారుడిపై హైకోర్టు కన్నెర్రజేసింది. ఈ మేరకు న్యాయస్థానం తీర్పుతో అధికారులు ఆగమేఘాల మీద వచ్చి అతడిని ఇంటి నుంచి పంపించేసి తల్లికి తాళం చెవులు అప్పగించారు.
దీనికి సంబంధించి తహసీల్దార్ శ్రావణ్కుమార్ తెలిపిన వివరాల ప్రకారం దర్శి పట్టణంలోని అద్దంకి రోడ్డు ఎస్టీ కాలనీలో ప్రభుత్వం కేటాయించిన స్థలం, నిధులతో 1990లో వాంకడవత్ లక్ష్మీబాయి, వెంకటేశ్వర నాయక్ ఇల్లు నిర్మించుకున్నారు. వీరి పెద్ద కుమారుడు శ్రీనివాసనాయక్ ఉపాధ్యాయునిగా పనిచేస్తూ వేరేచోట ఉంటున్నారు. చిన్న అబ్బాయి హనుమంతునాయక్ ఆటో నడుపుకుంటూ తల్లిదండ్రులతో కలిసి ఉంటున్నాడు.