Svamitva Scheme in AP :గ్రామ కంఠాల్లోని ఇండ్లు, ఖాళీ స్థలాలపై ప్రజలకు యాజమాన్య హక్కులు కల్పించే స్వమిత్వ పథకం పనులు మళ్లీ ప్రారంభమయ్యాయి. మే నెలాఖరుకల్లా 10 లక్షల ఆస్తులకు సంబంధించి క్షేత్రస్థాయిలో సర్వే పూర్తిచేసి, యాజమాన్య హక్కు పత్రాలు అందజేయాలని సర్కార్ భావిస్తోంది. వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఈ పథకానికి నిధులివ్వకుండా నిర్లక్ష్యం చేసింది. కోటికిపైగా ఆస్తులుంటే ఐదేళ్లలో ఐదు లక్షలకే యాజమాన్య హక్కులను నిర్ధారించారు. అందులోనూ 3 లక్షలు మాత్రమే ధ్రువపత్రాలు (ప్రాపర్టీ కార్డులు) పంపిణీ చేశారు.
సార్వత్రిక ఎన్నికలకు సంవత్సరం ముందే ఈ పథకం పనులు నిలిచిపోయాయి. దీని ప్రాధాన్యాన్ని గుర్తించిన కూటమి ప్రభుత్వం మిగిలిన గ్రామాల్లో సర్వే పూర్తిచేసి వచ్చే మూడేళ్లలో ఇళ్లు, స్థలాలు, ఇతర ఆస్తులపై ప్రజలకు హక్కులు కల్పించేలా కార్యాచరణ రూపొందించింది. ఈ విభాగానికి ప్రత్యేక అధికారిని నియమించింది.
సీఎం ఫొటోకు బదులు ప్రభుత్వ లోగో :గ్రామ కంఠాల్లో ఇళ్లు, స్థలాలను ఇతరులకు విక్రయించి రిజిస్ట్రేషన్ చేసే హక్కు ఇప్పటికీ లేదు. స్వమిత్వ పథకంలో ఇచ్చే యాజమాన్య హక్కు పత్రాలతో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో రిజిస్ట్రేషన్ చేయించుకోవచ్చు. దీనికోసం సర్కార్ చట్ట సవరణ చేయనుంది. కీలకమైన ఇలాంటి పథకానికి గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం నిధులివ్వకుండా తూట్లు పొడిచింది. 17,554 రెవెన్యూ గ్రామాల్లో కోటికిపైగా గ్రామకంఠం ఆస్తులుంటే గత ఐదు సంవత్సరాల్లో 1410 గ్రామాల్లో 5 లక్షల ఆస్తులను మాత్రమే డ్రోన్ చిత్రాల ద్వారా సర్వే చేశారు.
వీటికి సంబంధించి ముద్రించిన మూడు లక్షల ధ్రువపత్రాల్లో అప్పటి సీఎం జగన్ ఫొటో ఉండడంపై విమర్శలు వచ్చాయి. వాటిని పట్టించుకోకుండా ప్రజలకు పంపిణీ చేశారు. ఎన్నికల నోటిఫికేషన్ వెలువడడంతో మరో రెండు లక్షల కార్డుల ముద్రణ నిలిచింది. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం కార్డు డిజైన్ను మార్చనుంది. వాటిపై సీఎం ఫొటోకు బదులు ప్రభుత్వ లోగో ముద్రించాలని నిర్ణయించింది. మిగిలిన గ్రామాల్లో దశల వారీగా సర్వే పూర్తి చేయనుంది.