ఆంధ్రప్రదేశ్

andhra pradesh

టీడీఆర్ బాండ్ల కుంభకోణంపై ఏపీ ప్రభుత్వం ఫోకస్ - సీఐడీ దర్యాప్తునకు యోచన - TDR Bonds Scam in AP

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jul 31, 2024, 7:06 AM IST

AP Govt Focus on TDR Bonds Scam : ఐదేళ్ల వైఎస్సార్సీపీ పాలనలో అవినీతి, అక్రమాలు అనంతం. టీడీఆర్‌ బాండ్ల జారీలో తీగ లాగితే డొంక కదిలుతోంది. నిబంధనలకు విరుద్ధంగా జారీ చేసిన టీడీఆర్‌ బాండ్ల కుంభకోణంలో గత సర్కార్‌లోని కొందరు మంత్రులు, ప్రజాప్రతినిధులు రూ.2,000ల కోట్లు వరకు కమీషన్ల రూపేణ జేబులో వేసుకున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీనిపై నిగ్గు తేల్చేందుకు సీఐడీ దర్యాప్తునకు ఆదేశించేందుకు ప్రభుత్వం యోచిస్తోంది.

TDR Bonds Scam in AP
TDR Bonds Scam in AP (ETV Bharat)

TDR Bonds Scam Updates in AP : వైఎస్సార్సీపీ ఐదేళ్ల పాలనలో రూ.10 వేల కోట్ల విలువైన టీడీఆర్‌ బాండ్లు జారీ చేశారని ప్రాథమిక అంచనా. తిరుపతి, విశాఖ, కాకినాడ నగరాలతో పాటు తణుకులో నిబంధనలకు విరుద్ధంగా భారీగా బాండ్లు ఇచ్చేశారు. ఈ కుంభకోణంలో ఆనాటి ప్రభుత్వంలోని కొందరు మంత్రులు, ప్రజాప్రతినిధులు రూ.2 వేల కోట్ల వరకు కమీషన్ల రూపేణ జేబులో వేసుకున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. గత సర్కార్ పెద్దల ధనదాహానికి పుర, నగరపాలక సంస్థల అధికారులు సహకరించారు.

CID Investigation on TDR Bonds Scam : మాస్టర్‌ ప్లాన్‌రోడ్ల విస్తరణ, ఇతర సామాజిక అవసరాలకు చేపట్టిన పనుల్లో స్థలాలు కోల్పోయిన వారిలో కొందరికి అడ్డగోలుగా టీడీఆర్‌ బాండ్లు ఇచ్చేశారు. నివాస ప్రాంతాల్లో స్థలాలు కోల్పోగా, వారికి దూరంగా ఉన్న కమర్షియల్‌ డోర్‌ నంబర్లు వేసి నష్టపోయిన మొత్తాన్ని కూడా భారీగా చూపించి కుంభకోణానికి పాల్పడ్డారు. తొలుత మిన్నకున్న వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఈ బాండ్లన్నీ బిల్డర్లకు, ప్రజలకు విక్రయించినట్లు నిర్ధారించుకున్నకే వాటి వినియోగంపై ఆంక్షలు విధించింది. మంత్రులు, ఎమ్మెల్యేల కమీషన్లకు ఇబ్బంది లేకుండా గత పురపాలక, పట్టణాభివృద్ధి శాఖప్రత్యేక ప్రధాన కార్యదర్శి శ్రీలక్ష్మి జాగ్రత్తలు తీసుకున్నట్లు ఆరోపణలున్నాయి.

YSRCP Leaders TDP Bonds Scam : మరోవైపు కొనుగోలు చేసిన బాండ్లతో అపార్ట్‌మెంట్లలో అదనపు అంతస్తులు వేసుకోవడానికి ఏడాదిన్నరగా అనుమతించకపోవడంతో బిల్డర్లు, ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అడ్డగోలుగా టీడీఆర్‌ బాండ్లు జారీ చేయించిన నాటి ప్రజాప్రతినిధులు, అమ్మిన వారు లాభపడగా, కొనుక్కున్న వారు అప్పుల పాలయ్యారు.

"ప్రభుత్వ అధికారులు, వాటిని అమ్మిన బ్రోకర్లు చేసిన తప్పుల వల్ల మేము బలైపోయాం. వైబ్​సైట్​ నుంచి మేము కోనుగోలు చేశాం. నిర్మాణాలు చేపట్టాం. కానీ ఇప్పుడు వాటిని మధ్యలోనే ఆపేశాం. మాకు సంబంధం లేని విషయం వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. ఇప్పటికైనా దీనిపై కూటమి ప్రభుత్వం స్పందించి మాకు న్యాయం చేయాలని కోరుతున్నాం." - శివాజీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, నరెడ్కో

తణుకులో భారీగా అక్రమాలు :జారీ చేసిన బాండ్లలో భారీగా అక్రమాలు జరిగాయి. పురపాలక సంఘం అవసరాలకు వినియోగించుకున్న స్థలంపై చదరపు గజానికి రూ.4,500 బదులు అక్కడికి 1.4 కిలోమీటర్ల దూరంలోని ఓ డోరు నంబర్‌తో చదరపు గజం రూ.22,000ల చొప్పున లెక్కించి రూ.754.67 కోట్ల విలువైన బాండ్లు ఇచ్చి భారీగా లబ్ధి చేకూర్చారు. ఈ వ్యవహారంలో గత ప్రభుత్వంలోని ఓ మంత్రితో పురపాలక అధికారులు కుమ్మక్కయ్యారు.

తిరుపతిలో 2,85,406 చదరపు గజాలకు నగరపాలక సంస్థ టీడీఆర్‌ బాండ్లు ఇచ్చింది. స్థానిక ధరల ప్రకారం గజానికి రూ.35,000ల చొప్పున లెక్కించినా పరిహారంగా మొత్తం వెయ్యి కోట్ల విలువైన బాండ్లు జారీ చేయాలి. కానీ సేకరించిన స్థలాలను కమర్షియల్‌గా చూపించి నాలుగు రెట్లు అధికంగా రూ.4052 కోట్లకు చూపి 340 బాండ్లు ఇచ్చారు. ఒక ప్రాంతంలో ఇచ్చిన 45 బాండ్లలో చదరపు గజం ధర రూ.5,200కు బదులు ఓ వాణిజ్య భవనం ఇంటి నంబర్‌ వేసి రూ.32,000ల చొప్పున లెక్కించారు. తిరుపతిలో టీడీఆర్‌ బాండ్లలో కమీషన్ల రూపేణా కోట్లు చేతులు మారాయి.

కాకినాడలో చక్రం తిప్పారు : కాకినాడలో ఓ లేఔట్​లోని ఖాళీ స్థలంలో చేపట్టిన కన్వర్టబుల్‌ స్టేడియంపై ఓ ప్రైవేట్ వ్యక్తులకు రూ.64 కోట్లకు బదులుగా రూ.129 కోట్ల విలువైన టీడీఆర్‌ బాండ్లు జారీ చేశారు. స్టేడియం నిర్మించిన ప్రాంతంలోని ఇంటి నంబర్‌లో చదరపు గజం ధర సబ్​రిజిస్ట్రార్‌ కార్యాలయంలోని రికార్డుల్లో రూ.18,000లుగా ఉంది. ఇదే ఇంటి నంబర్​ను సబ్​రిజిస్ట్రార్‌ సహకారంతో వైఎస్సార్సీపీ నేతలు కమర్షియల్‌గా మార్పించి చదరపు గజం ధర రూ.36,000లకు పెంచారు. కార్పొరేషన్‌ అధికారుల సాయంతో రూ.129 కోట్లకు బాండ్లు జారీ చేయించారు. ఈ వ్యవహారంలో గత ప్రభుత్వంలోని ఒక ఎంపీ, ఓ ఎమ్మెల్యే చక్రం తిప్పారు.

రోడ్డు విస్తరణపై ఎంత ముందుచూపో? : విశాఖలో మాస్టర్‌ ప్లాన్‌ ప్రకారం రోడ్లు వేయకుండానే భవిష్యత్​లో స్థలం కోల్పోవచ్చని ముందుగానే భావించి పలువురికి బాండ్లు ఇచ్చేశారు. సిరిపురం కూడలిలో జీవీఎంసీ కమిషనర్‌ బంగ్లాను ఆనుకుని ఉన్న సీబీసీఎన్​సీ స్థలాన్ని మాజీ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ డెవలప్‌మెంట్‌కు తీసుకుని భారీ గృహ నిర్మాణ ప్రాజెక్టు చేపడుతున్నారు. ఈ ప్రాజెక్టుకు ముందున్న స్థలంలో కొంత భాగం 17 ఏళ్ల తర్వాత జీవీఎంసీ అభివృద్ధి చేసే మాస్టర్‌ ప్లాన్‌ రోడ్డులో పోతోందని ఇప్పుడే లెక్కలేసి రూ.63 కోట్ల విలువైన టీడీఆర్‌ బాండ్లు ఇచ్చేశారు.

దశాబ్దాలుగా పేదలు నివసిస్తున్న పెద్దజాలారిపేట, సీతమ్మధారలోని బిలాల్‌ కాలనీ భూమి, ఓ మురికివాడ, దసపల్లా భూముల్లోనూ టీడీఆర్‌ బాండ్ల కోసం ఎన్నికల ముందు వైఎస్సార్సీపీ నేతలు తీవ్రంగా ప్రయత్నించారు. గత ప్రభుత్వంలో అడ్డగోలుగా ఇచ్చిన టీడీఆర్ బాండ్లపై కూటమి ప్రభుత్వం ప్రాథమిక సమాచారం సేకరించింది. ఈ కుంభకోణంపై సీఐడీ దర్యాప్తునకు ఆదేశించే అవకాశం ఉంది.

60ఫీట్ల రోడ్డును 40ఫీట్లుగా చూపిస్తూ - 'ఉడా'లో రూ.15 కోట్లకు పైగా టీడీఆర్​ బాండ్ల కుంభకోణం!

YSRCP Leaders TDP Bonds Scam: అక్రమాలకు అడ్డేది.. టీడీఆర్‌ బాండ్లతో కోట్లు కొల్లగొడుతున్న వైసీపీ నేతలు

ABOUT THE AUTHOR

...view details