AP CID EX Chief Sunil Kumar Irregularities :సీఐడీ మాజీ చీఫ్ పీవీ సునీల్కుమార్ అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని న్యాయవాది గూడపాటి లక్ష్మీనారాయణ ఇచ్చిన ఫిర్యాదుపై ప్రభుత్వం విచారణ చేపట్టింది. నెల్లూరు సీఐడీ డీఎస్పీ విజయవాడకు వచ్చి పలువురు నుంచి స్టేట్మెంట్ తీసుకున్నారు. సీఐడీ విభాగాధిపతిగా పనిచేసిన సమయంలో సునీల్కుమార్ సామాన్య ప్రజల్ని తప్పుడు కేసుల్లో ఇరికించి, కస్టడీలో చిత్రహింసలకు గురిచేశారని హైకోర్టు న్యాయవాది లక్ష్మీనారాయణ అధికారులకు తెలిపారు.
క్రిమినల్ లాను ఆయుధంగా వినియోగించుకుని పౌరుల్ని వేధించారని లక్ష్మీనారాయణ పేర్కొన్నారు. అరెస్టులు, కస్టడీల విషయంలో సుప్రీంకోర్టు మార్గదర్శకాలు, రాజ్యాంగాన్ని ఉల్లంఘించారన్నారు. చీకటి పడిన తర్వాత బాధితుల ఇళ్లల్లోకి సీఐడీ అధికారుల్ని పంపించారని చెప్పారు. ఏడేళ్ల లోపు శిక్ష పడే సెక్షన్ల కింద నమోదు చేసిన కేసుల్లో కూడా సీఆర్పీసీ 41ఏ నోటీసులివ్వకుండానే అరెస్టులు చేసినట్లు సీఐడీ అధికారులకు ఆయన వివరించారు.
విచారణ గదుల్లో అప్పట్లో ఎక్కడా సీసీ కెమెరాలు లేవని ఇది సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు విరుద్ధమని లక్ష్మీనారాయణ వివరించారు. కస్టడీలో పాల్పడ్డ హింస గురించి న్యాయమూర్తుల ఎదుట చెబితే తీవ్ర పర్యవసానాలు ఉంటాయని బాధితులను, వారి కుటుంబ సభ్యుల్ని తీవ్రంగా బెదిరించారన్నారు. సామాజిక మాధ్యమ కేసులు సీఐడీ పరిధిలోకి రావని కానీ వాటిని అడ్డం పెట్టుకుని సునీల్కుమార్ ఇష్టానుసారంగా వ్యవహరించారని తెలిపారు.
"వైఎస్సార్సీపీ పాలనలో సీఐడీ చీఫ్గా ఉన్న సునీల్కుమార్ ఉన్నారు. ఆయన దురాగతాలపై కేంద్ర హోం మంత్రిత్వ శాఖకు ఫిర్యాదు చేశాం. దీనిపై డీమ్డ్ రిపోర్ట్ ఇచ్చారు. ఈ రిపోర్ట్ను సీఐడీ అధికారులు ఇచ్చాం. విచారణ అధికారులు మమల్ని విచారించారు. వారికి మాకు తెలిసిన విషయాలను చెప్పాం." - గూడపాటి లక్ష్మీనారాయణ, హైకోర్టు న్యాయవాది
Probe in PV Sunil Kumar :సీఐడీ వ్యవహరించిన తీరు హేయమని మరికొందరు బాధితులు గోడు వెళ్లబోసుకున్నారు. అర్ధరాత్రిపూట తమ ఇంటి తలుపులు విరగ్గొట్టి మరీ అధికారులు లోపలికి చొరబడ్డారని గార్లపాటి వెంకటేశ్వరరావు సీఐడీకి తెలిపారు. సీఆర్పీసీ 41ఏ నోటీసులు ఇవ్వకుండానే తనను అదుపులోకి తీసుకున్నారని వివరించారు. గుంటూరు సీఐడీ ప్రాంతీయ కార్యాలయంలో రాత్రంతా నిర్బంధించి తీవ్రంగా కొట్టారని వాపోయారు. మరుసటి రోజు సాయంత్రం కోర్టులో హాజరుపరిచినట్లు తెలిపారు.
కస్టడీలో తీవ్రంగా కొట్టిన విషయాన్ని న్యాయమూర్తి ఎదుట చెప్పగా వైద్య పరీక్షల కోసం ప్రభుత్వాసుపత్రికి పంపించారని గార్లపాటి వెంకటేశ్వరరావు వివరించారు. వైఎస్సార్సీపీ గౌరవ అధ్యక్షురాలి పదవికి వైఎస్ విజయమ్మ రాజీనామా చేసినట్లు సామాజిక మాధ్యమాల్లో తప్పుడు ప్రచారం చేశానంటూ తనపై కేసు పెట్టి హింసించారన్నారు. అప్పటి సీఐడీ డీఎస్పీ రామారావు, సీఐ జగదీష్, హెచ్సీ బాషా, వంశీలు దీనికి కారణమని చెప్పారు. వారందరిపైనా ప్రైవేట్ కేసు వేసినట్లు తెలిపారు. నాటి సీఐడీ విభాగాధిపతి సునీల్కుమార్ ఆదేశాల మేరకే చిత్రహింసలు పెట్టారు.