ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

దక్షిణాదిలో తగ్గుతున్న ఏపీ జనాభా - సగటు కుటుంబ సభ్యుల సంఖ్య 3.7

రాష్ట్రంలో సగటు కుటుంబ సభ్యుల సంఖ్య 3.7

Decreasing Family Population in AP
Decreasing Family Population in AP (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : 4 hours ago

Declining AP family population : ‘దేశ ప్రయోజనాల కోసం ఎక్కువ మంది పిల్లల్ని కనాలి. ఇద్దరికంటే ఎక్కువ సంతానం ఉన్నవారినే స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసేలా చట్టం తేబోతున్నాం’ అని ఏపీ సీఎం చంద్రబాబు ప్రకటించారు. ఇటీవల తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్‌ ఓ సామూహిక వివాహ కార్యక్రమానికి వెళ్లిన సందర్భంలో ‘భవిష్యత్​లో దక్షిణాది రాష్ట్రాల్లో జనాభా తగ్గుదల కారణంగా పార్లమెంట్ సీట్లు కూడా తగ్గే ప్రమాదం ఉంది. దీనికి విరుగుడుగా కొత్త దంపతులు 16 మంది పిల్లలను ఎందుకు కనకూడదు?’ అని నవ్వుతూ అన్నారు.

వాస్తవానికి ఉత్తరాది రాష్ట్రాల్లో జనాభా పెరుగుదల రేటు అధికంగా ఉంది. కానీ దక్షిణాది రాష్ట్రాల్లో బాగా తగ్గింది. ఇక్కడ కుటుంబ నియంత్రణ కార్యక్రమాలు పటిష్ఠంగా అమలు జరుగుతుండమే ఇందుకు కారణం. తద్వారా 2011 జనాభా లెక్కల నాటికే ఉత్తర, దక్షిణాది రాష్ట్రాల మధ్య సమతౌల్యం దెబ్బతింది. ఫలితంగా ఆర్థిక సంఘం సిఫార్సుల్లో దక్షిణాది రాష్ట్రాలు తమ వాటాను కోల్పోయాయన్న భావన వ్యక్తం అవుతోంది. ఈ ప్రమాదాన్ని పసిగట్టిన చంద్రబాబు పది సంవత్సరాల క్రితం నుంచే జనాభా పెంపు గురించి చెబుతుండగా, ఇప్పుడు ఆయనకు ఎంకే స్టాలిన్‌ స్వరం తోడయింది.

Chandrababu on Population Growth : మరోవైపు ఏపీలో కుటుంబం చిన్నబోతోంది. ఒక్కో కుటుంబంలోని సగటు సభ్యుల సంఖ్య 3.7కి పడిపోయింది. ఇది జాతీయ సగటు (4.3)తోపాటు, పక్కనున్న కర్ణాటక (4.3), తమిళనాడు, తెలంగాణ (4.1 చొప్పున), కేరళ (3.8) కంటే తక్కువ. నాబార్డ్‌ సంస్థ తాజాగా విడుదల చేసిన ఆల్‌ ఇండియా రూరల్‌ ఫైనాన్షియల్‌ ఇంక్లూజన్‌ సర్వే 2021-22 ద్వారా ఈ విషయం తేలింది.

నాబార్డు గతంలో చేసిన (2015 జులై 1నుంచి 2016 జులై మధ్యకాలంలో) సర్వే చేసింది. ఆ ప్రకారం ఆంధ్రప్రదేశ్​లోని ఒక్కో కుటుంబంలో సగటు సభ్యుల సంఖ్య 3.5 మేర ఉండగా, ఇప్పుడు 3.7కి చేరింది. తెలంగాణలో 3.8 నుంచి ప్రస్తుతం 4.1కు పెరిగింది. దక్షిణాదిలో అని రాష్ట్రాల కంటే సగటున కుటుంబ సభ్యుల సంఖ్య తక్కువ ఉన్నది ఏపీలోనే. ఉత్తరప్రదేశ్‌లో 5, బిహార్‌లో 4.8 వరకు ఉంది.

ఈ సర్వే ప్రకారం ఏపీలో 86 శాతం కుటుంబాలు అప్పుల్లో ఉన్నాయి. జాతీయ సగటు 52 శాతంతో పోలిస్తే ఇది ఎక్కువ. తెలంగాణ (92 శాతం) తర్వాత అత్యధిక కుటుంబాలు అప్పుల్లో ఉన్నది ఏపీలోనే. అప్పుల్లో ఉన్న కుటుంబాలు 2016-17లో 76 శాతంకి పరిమితమయ్యాయి. ఇప్పుడు అందులో 10 శాతం వృద్ధి నమోదైంది. ఇదే సమయంలో వ్యవసాయ కుటుంబాల నెలవారీ సగటు ఆదాయం మాత్రం రూ.6,920 నుంచి రూ. 12,294కి (77.65 శాతం) పెరిగింది. జాతీయస్థాయిలోనూ రైతు కుటుంబాల సగటు ఆదాయం రూ.8,931 నుంచి రూ.13,661 (52.96 శాతం)కి చేరింది. పంజాబ్‌ రైతు కుటుంబాలకు అత్యధికంగా నెలకు రూ.31,433 ఉంటోంది. వారి ఆదాయం రూ.23,133 నుంచి (35.87 శాతం) ఇంతవరకు పెరిగింది.

  • ఏపీవ్యాప్తంగా ఉన్న సాధారణ కుటుంబాల నెలవారీ సగటు ఆదాయం రూ.5,842 నుంచి రూ. 11,037కి (88.92 శాతం) పెరిగింది. ఇదే సమయంలో జాతీయ స్థాయిలో సగటు కుటుంబ ఆదాయం రూ.8,059 నుంచి రూ.12,698కి (57.56 శాతం) చేరింది.
  • గత సర్వే నాటికి, ఇప్పటికి నెలవారీ కుటుంబ వినియోగ వ్యయం రూ.5,746 నుంచి రూ.10,448కి పెరిగింది. జాతీయ సగటు వ్యయం కూడా రూ.8,059 నుంచి రూ.11,262కి పెరిగింది. ఆంధ్రప్రదేశ్​లో ఒక్కో కుటుంబానికి 2016-17లో నెలకు రూ.95 మిగలగా, ఇప్పుడు అది రూ.589కి పెరిగింది. పంజాబ్‌లో ఒక్కో కుటుంబానికి నెలకు రూ. 5,683 ఆదాయం మిగులుతుంది. బిహార్, ఏపీ, ఝార్ఖండ్, తెలంగాణలోని కుటుంబాల వద్ద మిగులు అతితక్కువగా ఉంటోంది.
  • ఏపీలో 96 శాతం కుటుంబాలు గ్రామీణ ప్రాంతాల్లో, 4 శాతం సెమీ అర్బన్‌ ప్రాంతంలో ఉన్నాయి.
  • వ్యవసాయ కుటుంబాల సంఖ్య 53 శాతం కాగా, వ్యవసాయేతర కుటుంబాలు 47 శాతం.
  • ఆంధ్రప్రదేశ్​లో వ్యవసాయ కుటుంబాల చేతుల్లో సగటున ఉండే భూ విస్తీర్ణం (నివాస భూమితో కలిపి) 1.06 హెక్టార్ల నుంచి 0.97 హెక్టార్లకు తగ్గిపోయింది. వ్యవసాయేతర కుటుంబాల చేతుల్లో ఉండే భూ విస్తీర్ణం 0.17 హెక్టార్ల నుంచి 0.06 హెక్టార్లకు పడిపోయింది. అన్ని కుటుంబాల చేతుల్లో ఉండే భూ విస్తీర్ణం మాత్రం 0.47 హెక్టార్ల నుంచి 0.54 హెక్టార్లకు పెరిగింది.
  • వ్యవసాయ కుటుంబం ఆధీనంలో ఉన్న సగటు భూమి విస్తీర్ణం 1.4 హెక్టార్ల నుంచి 1 హెక్టార్‌కు తగ్గింది. జాతీయస్థాయిలోనూ ఇది 1.1 హెక్టార్ల నుంచి 0.7 హెక్టార్లకు పడిపోయింది.
  • ఏపీలో భూమికి కౌలుకు తీసుకున్న కుటుంబాలు 4 శాతం, భూమి కౌలుకు ఇచ్చిన కుటుంబాలు 1.4 శాతం ఉన్నాయి.
  • ఆంధ్రప్రదేశ్​లోని 69 శాతం కుటుంబాలు ఎంతో కొంత మొత్తాన్ని పొదుపు చేస్తున్నాయి. ఇది జాతీయ సగటు కుటుంబాల సంఖ్య 66 శాతం కంటే అధికం.
  • ఒక వ్యవసాయ సంవత్సరంలో ఒక్కో కుటుంబం సగటున రూ.25,040 మొత్తం పొదుపు చేసింది. (జాతీయ సగటు రూ.20,139. అత్యధికంగా పొదుపు చేస్తున్న రాష్ట్రం జమ్మూకశ్మీర్‌ రూ.53,140)
  • ఏపీలో ఒక్కో కుటుంబంపై సగటున రూ. 92,125 అప్పు ఉంది. ఇది జాతీయ సగటు రూ.90,372కంటే 1.9 శాతం ఎక్కువ.
  • 2021-22 వ్యవసాయ సంవత్సరంలో రుణం తీసుకున్న కుటుంబాలు 75 శాతం. ఇది జాతీయ సగటు 42 శాతం కంటే చాలా ఎక్కువ. ఈ విషయంలో ఆంధ్రప్రదేశ్​, తెలంగాణ తొలి రెండు స్థానాలో ఉన్నాయి.
  • గ్రామాల్లో స్వయం సహాయక సంఘాలు అందుబాటులో ఉన్నట్లు 74.3 శాతం కుటుంబాలు చెప్పాయి.
  • తమ గ్రామంలో ఏదో ఒక జీవనోపాధి మార్గాలు అందుబాటులో ఉన్నట్లు 15.4 శాతం కుటుంబాలు పేర్కొన్నాయి.

'ఒక్కో జంట 16 మంది పిల్లల్ని ఎందుకు కనకూడదు?'- సీఎం స్టాలిన్ కీలక వ్యాఖ్యలు

ఇద్దరి కంటే ఎక్కువ పిల్లలు ఉంటేనే పోటీకి అర్హులు - సీఎం చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు

ABOUT THE AUTHOR

...view details