ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

హైకోర్టు బెంచ్‌- భవనం ఎంపిక కోసం కర్నూలులో పర్యటించనున్న హైకోర్టు జడ్జిలు - HIGH COURT JUDGES VISIT KURNOOL

దిన్నెదేవరపాడు వద్ద విద్యుత్‌ రెగ్యులేటరీ కమిషన్‌కు చెందిన భవనాన్ని పరిశీలించనున్న హైకోర్టు జడ్జిల బృందం - వెల్లడించిన రాష్ట్ర న్యాయశాఖ, మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి NMD ఫరూక్‌

A Team of judges will go to Kurnool Due to High Court Bench
A Team of judges will go to Kurnool Due to High Court Bench (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : Feb 2, 2025, 7:44 PM IST

A Team of judges will go to Kurnool Due to High Court Bench :కర్నూలులో హైకోర్టు బెంచ్‌ ఏర్పాటులో కీలక పరిణామం చోటుచేసుకుంది. బెంచ్‌కు అనువైన భవనాన్ని ఎంపిక చేసేందుకు ఈ నెల 6న హైకోర్టు జడ్జిల బృందం కర్నూలుకు వెళ్లనుంది. దిన్నెదేవరపాడు వద్ద విద్యుత్‌ రెగ్యులేటరీ కమిషన్‌కు చెందిన భవనాన్ని వారు పరిశీలించనున్నట్లు రాష్ట్ర న్యాయశాఖ, మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి NMD ఫరూక్‌ తెలిపారు. నంద్యాలలో ఆయన మీడియాతో మాట్లాడారు. బెంచ్ ఏర్పాటుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి వివరించారు.

కలెక్టర్​కు హైకోర్టు రిజిస్ట్రార్​ లేఖ : అయితే కర్నూలులో శాశ్వత హైకోర్టు బెంచ్‌ ఏర్పాటు కోసం 15 మంది న్యాయమూర్తులకు సరిపడా సౌకర్యాలకు సంబంధించిన పూర్తి వివరాలు సమర్పించాలని హైకోర్టు రిజిస్ట్రార్‌ గత నెల జనవరి 29న కర్నూలు జిల్లా కలెక్టర్‌ రంజిత్‌ బాషాకు లేఖ రాసిన విషయం తెలిసిందే. 15 మంది న్యాయమూర్తులకు సరిపడా మౌలిక సదుపాయాలు, కోర్టు కాంప్లెక్స్, కోర్టు గదులు, సిబ్బంది గదులు, న్యాయవాదులకు వసతి, న్యాయమూర్తులు, కోర్టు సిబ్బందికి నివాస, వసతి సౌకర్యాల పూర్తి సమాచారాన్ని జనవరి 30లోపు తమ ముందు ఉంచాలని, ఈ వ్యవహారాన్ని అత్యవసరంగా భావించాలని కలెక్టర్‌కు రాసిన లేఖలో రిజిస్ట్రార్‌ పేర్కొన్నారు.

అక్కడ సౌకర్యాలు ఉన్నాయా ?లేవా? : ఈ వివరాలను హైకోర్టు న్యాయమూర్తుల కమిటీ ముందు ఉంచాల్సిన బాధ్యత తనపై ఉందన్నారు. ఈ లేఖపై వెంటనే స్పందించిన కర్నూలు కలెక్టర్‌ రంజిత్‌ బాషా రహదారులు, భవనాలశాఖ సూపరింటెండెంట్‌ ఇంజినీర్, మున్సిపల్‌ కార్పొరేషన్‌ కమిషనర్, ఆర్డీవోలకు లేఖ రాశారు. హైకోర్టు కోరిన సౌకర్యాలతో ప్రభుత్వ/ప్రైవేటు భవనాలు ఉన్నాయా ?లేవా? అనే విషయాన్ని పరిశీలించి నివేదిక ఇవ్వాలని కోరారు. ప్రభుత్వ ఖాళీ భూములను గుర్తించి ఈ నెల 30లోపు నివేదిక ఇవ్వాలని కర్నూలు ఆర్డీవోకు స్పష్టం చేశారు.

రూ.25 కోట్లతో అత్యాధునిక భవనం : కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటుకు, న్యాయమూర్తులు, అధికారులు, సిబ్బంది వసతికి అవసరమైన భవనాల కోసం ఉన్నతాధికారులు విస్తృతంగా పరిశీలించారు. కర్నూలు నగర శివారులోని దిన్నెదేవరపాడులో ఆంధ్రప్రదేశ్‌ విద్యుత్తు నియంత్రణ మండలి(APERC) నూతన భవనాన్ని సుమారు రూ.25 కోట్లతో గతేడాది అధికారులు అత్యాధునికంగా నిర్మించారు. ఇందులో న్యాయస్థానం అవసరాలకు ఉపయోగపడే నాలుగు విశాలమైన హాళ్లు, ప్రత్యేక గదులు అందుబాటులో ఉన్నాయి. ఈ భవనానికి అనుబంధంగా ఉన్న అతిథిగృహం, అందులోని నాలుగు సూట్‌ రూములను వినియోగించుకోవచ్చు. వీటన్నింటికి సంబంధించి అధికారులు ప్రాథమిక ప్రతిపాదనలను హైకోర్టు రిజిస్ట్రార్​కు పంపించారు. అయితే హైకోర్టు బెంచ్‌ ఏర్పాటు కోసం కర్నూలు జిల్లా అధికారులు సూచించిన విద్యుత్‌ రెగ్యులేటరీ కమిషన్‌కు చెందిన భవనాన్ని పరిశీలించేందుకు హైకోర్టు జడ్జిల బృందం ఈ నెల 6న కర్నూలుకు రావటం విశేషం.

కర్నూలులో హైకోర్టు బెంచ్‌ ఏర్పాటుకు ముందడగు

కర్నూలులో హైకోర్టు బెంచ్‌ - అమరావతిలో లా కాలేజీ - చంద్రబాబు కీలక నిర్ణయాలు - Chandrababu Review Meetings

ABOUT THE AUTHOR

...view details