YSRCP Appeasing Unsatisfied Leaders for Rajya Sabha Elections:తన మాటే శాసనం, తన నిర్ణయమే ఫైనల్ అంటూ, ఎమ్మెల్యేల మార్పులు చేర్పులతో సీఎం జగన్ సంచలనాలకు తెర తీశారు. కష్టకాలంలో తనతో నడిచిన వారికి సైతం మెుండి చేయి చూపించారు. ఇన్నాళ్లు పార్టీ కోసం పని చేసిన నేతలకు టికెట్ కేటాయించే అంశంపై, అసంతృప్తిని సైతం పట్టించుకోకుండా ముందుకు సాగారు. ఇప్పటికే 6 జాబితాలు ప్రకటించి 32 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలు, 8 మంది సిట్టింగ్ ఎంపీలపై వేటు వేసిన సీఎం జగన్, అసంతృప్తి నేతలను పట్టించుకోలేదు. తాజాగా రాజ్యసభ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడిన నేపథ్యంలో ఎమ్మెల్యేలను ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారు. వైఎస్సార్సీపీ నుంచి టికెట్ భరోసా రాని నేతలు, ఆయా ప్రాంతాల్లో మార్పులపై అసంతృప్తితో ఉన్న నాయకులను బుజ్జగించే పనిలో పడ్డారు. అందులో భాగంగా నేడు కర్నూలు రాష్ట్ర కార్మికశాఖ మంత్రి గుమ్మనూరు జయరాంకు సీఎంవో నుంచి పిలుపు అందింది.
బుజ్జగింపుల పర్వం: రాజ్యసభ ఎన్నికల దృష్య్టా పార్టీలో అసంతృప్త ఎమ్మెల్యేలను వైఎస్సార్సీపీ బుజ్జగిస్తోంది. అసంతృప్తితో ఉన్న మంత్రి గుమ్మనూరు జయరాంకు తాడేపల్లి నుంచి పిలుపు రావడంతో సీఎం క్యాంపు కార్యాలయానికి వచ్చారు. వైఎస్సార్సీపీ రీజినల్ కో ఆర్డినేటర్ రామ సుబ్బారెడ్డి, సీఎంవోలో ధనుంజయరెడ్డితో సమావేశమయ్యారు. కర్నూలు జిల్లా ఆలూరు సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న మంత్రి జయరాంకు వచ్చే ఎన్నికల్లో ఆలూరు టికెట్ నిరాకరించారు. ఆలూరు ఎమ్మెల్యే అభ్యర్థిగా విరూపాక్షిని వైఎస్సార్సీపీ ప్రకటించింది. గుమ్మనూరు జయరాంను కర్నూలు ఎంపీ అభ్యర్థిగా వైఎస్సార్సీపీ ప్రకటించింది. కర్నూలు ఎంపీగా వెళ్లేందుకు నిరాకరిస్తున్న జయరాం గత కొంత కాలంగా అసంతృప్తిగా ఉన్నారు. వైఎస్సార్సీపీ నేతలకు అందుబాటులో లేకుండా పోయారు. రాజ్యసభ ఎన్నికల దృష్ట్యా గుమ్మనూరు జయరాంను వైఎస్సార్సీపీ నేతలు బుజ్జగించారు. ఆలూరు సీటు తనకే ఇవ్వాలని పట్టు పట్టినట్లు తెలిసింది.