ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / politics

చంద్రబాబు వ్యూహాలు బాగున్నాయి - మూడేళ్లలో ఏపీకి భారీగా పెట్టుబడులు: తెలంగాణ మంత్రి - SRIDHAR BABU ON ANDHRA PRADESH

ఏపీ సీఎం చంద్రబాబు విశాల దృక్పథంతో ఉన్నారన్న తెలంగాణ మంత్రి శ్రీధర్‌బాబు - ఆంధ్రప్రదేశ్‌కు మంచి పరిశ్రమలు వస్తాయని వ్యాఖ్య

Telangana Minister Sridhar Babu
Telangana Minister Sridhar Babu (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jan 28, 2025, 10:43 PM IST

Telangana Minister Sridhar Babu on Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్​కు భవిష్యత్తులో భారీగా పెట్టుబడులు వచ్చే అవకాశం ఉందని తెలంగాణ రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. ఏపీకి గ్లోబల్ కేపబిలిటీ ఉందని, కోస్తా ప్రాంతం, అపార వనరులు ఉన్నాయన్నారు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు విశాల ఆలోచనలతో ఉన్నారని మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. ఏపీకి మంచి పరిశ్రమలు వస్తాయని, ఇప్పటికే కొన్ని ఎంవోయూలు చేసుకున్నారని, వాటి వివరాలను ఏపీలోనే ప్రకటిస్తామని లోకేశ్ దావోస్​లో చెప్పారని శ్రీధర్ బాబు పేర్కొన్నారు.

చంద్రబాబు ప్రయత్నాలు బాగున్నాయి: పెట్టుబడులు రాబట్టేందుకు చంద్రబాబు ప్రయత్నాలు బాగున్నాయని కొనియాడారు. పెట్టుబడుల విషయంలో వారు వ్యూహాత్మకంగా ఉన్నారన్నారు. ఏపీకి అనుకూలతలు, పెట్టుబడుల కోసం చంద్రబాబు వ్యూహాలు, ప్రయత్నాలు చాలా బాగున్నాయని మంత్రి శ్రీధర్ బాబు వ్యాఖ్యానించారు. హైదరాబాద్​లో కంపెనీలు ఏపీకి తీసుకెళ్లి, ఇక్కడ ఆటంకాలు సృష్టించే ఆలోచన చంద్రబాబుకు ఏ మాత్రం లేదన్నారు. హైదరాబాద్ ఇంకా అభివృద్ధి కావాలని ఏపీ సీఎం చంద్రబాబు కోరుకుంటున్నారని తెలిపారు.

వచ్చే మూడేళ్లలో ఏపీకి భారీగా పెట్టుబడులు వచ్చే అవకాశం ఉందని అన్నారు. చంద్రబాబు శారీరంకగా చాలా దృఢంగా ఉన్నారని, దావోస్​లో మైనస్ 11 సెంటిగ్రేడ్​ ఉష్ణోగ్రతలో తామంతా స్వెటర్లు వేసుకుంటే, చంద్రబాబు మాత్రం సాధారణ డ్రెస్​లోనే ఉన్నారని శ్రీధర్ బాబు తెలిపారు. తెలంగాణ సచివాలయంలో మీడియా ప్రతినిధులతో చిట్​చాట్​లో ఈ విషయాలను శ్రీధర్ బాబు పంచుకున్నారు.

పాత విధానాలను కొనసాగించాలి: అధికారంలోకి ఎవరు వచ్చినా అప్పటి వరకు ఉన్న పాత విధానాలు కొనసాగించాలని మంత్రి శ్రీధర్ బాబు అభిప్రాయపడ్డారు. కేంద్రంలో మన్మోహన్ సింగ్ తీసుకొచ్చిన పాలసీలను నరేంద్రమోదీ కొనసాగిస్తున్నారన్న శ్రీధర్ బాబు, ఆ విధంగా పాలసీలను ముందుకు తీసుకెళ్లని కేవలం వైఎస్ జగన్ మాత్రమేనని వ్యాఖ్యానించారు.

తెలంగాణలో రెండు డ్రై పోర్టులు: తెలంగాణకు ఇప్పుడు వచ్చినన్ని పెట్టుబడులు పదేళ్లలో ఎప్పుడూ రాలేదని శ్రీధర్‌బాబు తెలిపారు. ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా నూతన ఐటీ పాలసీ తెస్తామని అన్నారు. ఆర్‌ఆర్‌ఆర్‌ చుట్టూ ఐటీ విస్తరణకు ప్రణాళికలు రూపొందిస్తున్నామని చెప్పారు. హైదరాబాద్ చుట్టూ మాల్స్ తెచ్చే యోచనలో ఉన్నామన్న తెలంగాణ మంత్రి, ప్రభుత్వ ఉద్యోగుల పదవీవిరమణ వయసు పెంపు ఆలోచన లేదని స్పష్టం చేశారు. తెలంగాణలో రెండు డ్రై పోర్టులు రానున్నాయని, నాలుగేళ్లలో ఫ్యూచర్‌సిటీని పూర్తి చేస్తామని వెల్లడించారు. రెండో శ్రేణి నగరాలు, పట్టణాల్లో పరిశ్రమలు, ఐటీ అభివృద్ధి చేస్తామని తెలంగాణ మంత్రి శ్రీధర్‌బాబు అన్నారు.

'హైదరాబాద్ తెలుగు ప్రజలది - గోదావరి నీళ్లు బనకచర్లకు తరలిస్తే తెలంగాణకు నష్టం లేదు'

పోలవరం ప్రభావంపై తెలంగాణ అధ్యయనం - నివేదిక కోరిన రేవంత్​రెడ్డి

ABOUT THE AUTHOR

...view details