Minister Anitha on Vallabhaneni Vamsi Arrest: వల్లభనేని వంశీ అరెస్ట్ విషయంలో కర్మ సిద్ధాంతం కనిపిస్తోందని హోంమంత్రి వంగలపూడి అనిత అన్నారు. డీజీపీ అపాయింట్మెంట్ ఇవ్వలేదని వైఎస్సార్సీపీ నేతలు చెబుతున్నారన్న ఆమె, నిన్న డీజీపీ బిజీగా ఉండి ఉండచ్చని అన్నారు. ఈ 8 నెలల్లో వైఎస్సార్సీపీ నేతలు ఎన్నిసార్లు డీజీపీని కలిసి విజ్ఞాపన పత్రాలు ఇచ్చారని అనిత ప్రశ్నించారు. వంశీ అరెస్టు అక్రమం కాదని సక్రమమేనని దానికి అన్ని ఆధారాలు ఉన్నాయని తెలిపారు. కేసులు పెట్టి అరెస్ట్ చేసే విషయంలో జాగ్రత్తగా ఉండాలని పోలీసులకు చెప్పామని హోం మంత్రి తెలిపారు.
వంశీ జైల్లో ఉంటేనే సమాజానికి మంచిది: గన్నవరం పార్టీ కార్యాలయం దాడి ఘటనలో 71వ నిందితుడిగా ఉన్న వల్లభనేని వంశీ తానంతట తానే వచ్చి కిడ్నాప్ కేసులో ఏ1గా ఇరుక్కున్నాడని మాజీమంత్రి జవహర్ ధ్వజమెత్తారు. వంశీ చరిత్ర మొత్తం అరాచకమయమని మండిపడ్డారు. కేవలం తాడేపల్లి ప్యాలెస్ పెద్ద సైకోని సంతృప్తి పరిచేందుకు ఇష్టానుసారంగా విధ్వంసం సృష్టించాడని ఆగ్రహం వ్యక్తం చేసారు. కేసు నుంచి తప్పించుకునేందుకు ఒక ఎస్సీ యువకుడిని తక్కువ చులకన చేసి, బలిపశువుని చేద్దామని చూసి అడ్డంగా దొరికాడని విమర్శించారు. వంశీ లాంటి దుర్మార్గులను సంఘ బహీష్కరణ చేయాలని సూచించారు. వంశీ లాంటి వ్యక్తి జైల్లో ఉంటేనే సమాజానికి మంచిదని వెల్లడించారు.
వల్లభనేని వంశీ ఒక వ్యవస్థీకృత నేరగాడు:పోలీసుల రికార్డులో వాంటెడ్ క్రిమినల్గా నమోదై ఉన్న వల్లభనేని వంశీ ఒక వ్యవస్థీకృత నేరగాడు అని జిల్లా టీడీపీ అధ్యక్షులు నెట్టెం రఘురాం, ఎమ్మెల్యే శ్రీరామ్ తాతయ్య విమర్శించారు. వంశీ అరెస్టును అక్రమమని అక్రమశిస్తున్న వైఎస్సార్సీపీ నాయకులు ఒకసారి తమ అక్రమ పాలన సింహావలోకనం చేసుకోవాలని అన్నారు. నేరం చేసిన ప్రతివారికి టీడీపీ కాలంలో చట్టపరమైన శిక్ష తప్పదని, న్యాయ వ్యవస్థకు లోబడి ప్రతి ఒక్కరం మూల్యం చెల్లించక తప్పదని సిద్ధంగా ఉండాలని అన్నారు.