తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న ఉచిత చేప పిల్లల పంపిణీ కార్యక్రమాన్ని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు వరంగల్ అర్బన్ జిల్లాలో చేపట్టారు. జిల్లాలోని కాజీపేట మండలం మడికొండ పెద్ద చెరువులో కలెక్టర్ ప్రశాంత్ పాటిల్, ఎమ్మెల్యే ఆరూరి రమేష్ తో కలిసి మంత్రి చేపపిల్లలను నీటిలోకి వదిలారు. రాష్ట్రంలో 86 కోట్ల చేప పిల్లలను చెరువుల్లో వదలడానికి తెలంగాణ ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని మంత్రి తెలిపారు. వరంగల్ జిల్లాలో ఒక కోటి 30 లక్షల చేప పిల్లలకుగాను మడికొండలోని చెరువులు కుంటల్లో మూడు లక్షల చేప పిల్లలను పంపిణీ చేస్తున్నట్లు పేర్కొన్నారు. చేపల అమ్మకానికి ముదిరాజ్, బెస్త కులస్తులకు ట్రాలీ ఆటోలు, ద్విచక్ర వాహనాలకు ప్రభుత్వం సబ్సిడీ అందజేస్తుందని అన్నారు. వర్షాలు ఆలస్యమైనప్పటికీ జిల్లాలో దాదాపు 70 శాతం వరకు చెరువుల్లోకి నీరు వచ్చిందని, దేవాదుల ఎస్సారెస్పీ నీటి ద్వారా మిగిలిన అన్ని చెరువులను నీటితో నింపుతామని మంత్రి వివరించారు.
ఇదీ చూడండి : అనుష్క పంటచేలకొచ్చింది... ఎందుకబ్బా!