ఉపాధి కోసం గల్ఫ్ దేశాలకు వెళ్లిన నిజామాబాద్ జిల్లా ధర్పల్లి మండలం రేకులపల్లి గ్రామానికి చెందిన మాలవత్ పాండ్య(32) రెండు రోజుల క్రితం పనిచేస్తున్న ప్రదేశంలో గుండెపోటుతో కుప్పకూలాడు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శనివారం మృతి చెందాడు. ఇంటి పెద్ద దిక్కు మరణవార్త విన్న కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరవుతున్నారు. మృతుడికి భార్య శాంతితో పాటు ఇద్దరు కుమారులు ఉన్నట్లు గ్రామస్థులు తెలిపారు. నిజామాబాద్ గ్రామీణ నియోజకవర్గంలోని సిరికొండ మండలం కొండాపూర్ గ్రామానికి చెందిన కమ్మరి రాములు(47) ఉపాధి నిమిత్తం సౌదీ అరేబియా వెళ్లాడు. 2 నెలల క్రితం రెండు కిడ్నీలు చెడిపోవడంతో చికిత్స పొందుతూ శనివారం మృతి చెందినట్లు కుటుంబ సభ్యులకు సమాచారం అందింది.
ప్రభుత్వం స్పందించి తమ వారి మృతదేహాలను త్వరగా స్వదేశానికి రప్పించాలని కుటుంబ సభ్యులు వేడుకుంటున్నారు. గాంధారి మండలం బూర్గుల్ గ్రామానికి చెందిన దేవయ్య అనే యువకుడు, నిర్మల్ పట్టణానికి చెందిన మరో యువకుడితో కలిసి పదినెలల క్రితం ఉపాధి కోసం సౌదీ అరేబియా వెళ్లాడు. వీరు పనిచేస్తున్న కంపెనీ మూడు నెలలు మాత్రమే పని కల్పించి.. ఆ తర్వాత పట్టించుకోవడంలేదని, పని లేకుండా ఏడు నెలల నుంచి తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని, ప్రభుత్వంతో మాట్లాడి స్వదేశానికి రప్పించాలని గల్ఫ్ వెల్ఫేర్ సొసైటీ ప్రతినిధి బసంత్ రెడ్డికి సామాజిక మాధ్యమం ద్వారా విన్నవించారు.
ఇవీచూడండి: ఆ గంటలో ఏం జరిగింది ? ప్రమాదం ఎందుకు సంభవించింది ?