ఉమ్మడి మహబూబూబ్నగర్ జిల్లా వ్యాప్తంగా జడ్పీటీసీ, ఎంపిటీసీ స్థానాలకు ఎన్నికలు జరుగుతుండగా జడ్చర్ల మండలంలో మాత్రం ఎంపీటీసీ, ఎంపీపీ ఎన్నికలు జరగడం లేదు. ఇక్కడ ఎంపీటీసీ ఎన్నికలను నిలిపివేయాలని ఎన్నికల సంఘం ఆదేశించడంతో... కేవలం జడ్పీటీసీ ఎన్నిక మాత్రమే నిర్వహిస్తున్నారు.
ఎన్నికలు ఎందుకు లేవంటే?
జడ్చర్ల మండలంలో 2014 లో అంతటా జరిగినట్లే ఎంపీటీసీ ఎన్నికలు జరిగాయి. కానీ అనంతరం ఎంపీపీ ఎన్నిక, మొదటి పాలకవర్గ సమావేశం మాత్రం ఆలస్యమైంది. మే 4వ తేదీ 2015లో జరిగింది. దీంతో ఆ పాలకవర్గానికి ఐదు సంవత్సరాల పదవీకాలం పూర్తి కాలేదు. వీరి పదవీకాలం మరో 10 నెలలు ఉండడంతో ఎన్నికల సంఘం ఇక్కడి ఎంపీటీసీ ఎన్నికలను వాయిదా వేసింది. ప్రస్తుతం ఇక్కడ జడ్పీటీసీ ఎన్నిక మాత్రమే నిర్వహిస్తున్నారు.
అసలు విషయం ఇది...
జడ్చర్ల మండలంలో ఎంపీటీసీ ఎన్నికలు జరగకపోవడానికి కారణం... గతంలో బాదేపల్లి పురపాలికలో కావేరమ్మపేట పంచాయతీని కలపడంతో ఆ పంచాయతీ వారు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. కోర్ట్ స్టే ఇచ్చింది. పురపాలిక నుంచి తిరిగి కావేరమ్మపేట పంచాయతీని మినహాయించి ఎన్నికలు నిర్వహించారు. ఆ కారణంగా జడ్చర్ల ఎంపీపీ ఎన్నిక ఆలస్యమైంది. పాలకమండలి కూడా 10 నెలల తర్వాత కొలువుదీరింది. ప్రస్తుతం మహబూబ్నగర్ జిల్లా వ్యాప్తంగా ఎంపీటీసీ ఎన్నికలు జరుగుతుండగా జడ్చర్ల మండలంలో మాత్రం 15 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు జరగడం లేదు. మరో10 నెలల తర్వాతే జడ్చర్ల మండలంలో ఎంపీటీసీ, ఎంపీపీ ఎన్నికలు జరిగే అవకాశం ఉంది.
ఇవీ చదవండి: కళ్లు తెరవండి... పరీక్ష పత్రాలు మళ్లీ దిద్దండి