వారానికి ఒకరోజు గ్రామ ప్రజలందరూ కలిసి శ్రమదానం చేసి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకునేలా కృషి చేయాలని మహబూబ్నగర్ జిల్లా కలెక్టర్ వెంకట్రావు సూచించారు. దేవరకద్ర మండలం హజిలాపూర్, లక్ష్మీపల్లిలో ఆకస్మికంగా పర్యటించారు. గ్రామాలలో జరుగుతున్న పారిశుద్ధ్య పనులను పరశీలించారు. చుట్టూ ఉన్న పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకునట్లయితే సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ఉంటాయన్నారు.
అనంతరం లక్ష్మీపల్లిలో ఉన్న నర్సరీని సందర్శించారు. పెంచుతున్న మొక్కలు గురించి సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో బియ్యం పంపిణీని పరిశీలించి.. ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూసుకోవాలని ఆదేశించారు. గ్రామ పంచాయతీ కార్యాలయం ఆవరణలో రైతులతో మాట్లాడారు. ఈ సందర్భంగా తమ గ్రామంలోని సాగునీటి సమస్యలను పరిష్కరించాలని రైతులు కలెక్టర్కు విన్నవించారు. స్పందించిన కలెక్టర్ సాగునీటి సమస్యను పరిష్కరించేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.