మహబూబాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిని జిల్లా కలెక్టర్ వీపీ గౌతమ్ ఆకస్మికంగా సందర్శించారు. ఆసుపత్రిలోని అన్ని విభాగాలను పరిశీలించారు. వైద్య సేవల గురించి రోగులను అడిగి తెలుసుకున్నారు. ఆసుపత్రిలో ఉన్న సౌకర్యాలు, వైద్యులు, ప్రత్యేక నిపుణుల, వివరాల చార్ట్లో పరిశీలించారు. బోర్డులను తెలుగు భాషలో ప్రదర్శించాలని ఆదేశించారు. పిండం ఆరోగ్యం తెలుసుకోవడానికి టిఫా స్కాన్ సౌకర్యం లేదని కలెక్టర్ దృష్టికి తీసుకురాగా... ఆసుపత్రిలో ఉన్న పరికరాలు, అవసరాల వివరాలను వెంటనే నివేదిక సమర్పించాలని వైద్యులకు సూచించారు.
ఫార్మసీలో ప్రతి ఔషధం ఈ-ఔషధి ద్వారానే జరగాలన్నారు. రోగులకు అందిస్తున్న మందులను పరిశీలించారు. 920 రకాల మందులను ప్రభుత్వం ఉచితంగా అందిస్తున్నదని, రోగులకు అవసరమైన మందులన్ని ఉచితంగా ఇవ్వాలన్నారు. ఆసుపత్రిలోని ల్యాబ్స్లో ఎలిసా, డెంగ్యూ పరీక్షలు జరగడం లేదని దృష్టికి రాగా... అందుకు అవసరమైన పరికరాలు కొనుగోలుకు వెంటనే ప్రతిపాదనలు సిద్ధం చేయాలని కలెక్టర్ ఆదేశించారు.