కరోనా వైరస్ నేపథ్యంలో నగరం నలుమూలల నుంచి బాధితులు వచ్చేందుకు ఇబ్బందిగా ఉన్నందున పోలీస్ ఉన్నతాధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. ప్రతి జోన్లో ఒక కేంద్రాన్ని ఏర్పాటు చేసి సమస్యలను ఎదుర్కొంటున్న యువతులు, మహిళలను అక్కడికి రప్పించిన అనంతరం భరోసా కేంద్రంలో పోలీస్ అధికారులు, కౌన్సిలర్లు వారితో మాట్లాడనున్నారు. వచ్చే నెల తొలివారం నుంచి నగరంలో ఈ-భరోసా సేవలు అందుబాటులోకి తీసుకువచ్చేందుకు పోలీస్ ఉన్నతాధికారులు సన్నాహాలు చేస్తున్నారు.
సమాచార సాంకేతిక పరిజ్ఞానం
గృహహింస అనుభవిస్తున్న బాధితులకు సత్వర న్యాయం అందించేందుకు పోలీసులు ఈ-భరోసాను తెరపైకి తెచ్చారు. పోలీస్ కమిషనరేట్ నుంచి అన్ని పోలీస్ ఠాణాల అధికారులకు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించినట్టే.. భరోసా కేంద్రానికి అనుసంధానంగా నగరంలో ఐదు ప్రాంతాల్లో టెలి, వీడియో కౌన్సెలింగ్ సేవలను అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
హాకా భవన్లోని ఈ కేంద్రం నుంచి ఒకేసారి ఐదు కేంద్రాలకు హాజరైన వారితో పోలీసు అధికారులు, కౌన్సిలర్లు మాట్లాడనున్నారు. భర్త, కుటుంబ సభ్యుల చేతుల్లో చిత్రహింసలు ఎదుర్కొంటున్న మహిళలు ఈ నెల తొలి వారంలోనే వంద మందికిపైగా వచ్చారని పోలీసులు తెలిపారు. వీరిలో చాలామంది లాక్డౌన్ సమయంలో తాము తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నామని పోలీసులకు వివరించారు.
వెంటనే స్పందించిన పోలీసులు.. చిత్రహింసలకు గురిచేసిన వారిని పిలిపించి కౌన్సెలింగ్ ఇచ్చారు. ఇకపై గృహహింస ఎదుర్కొంటున్న మహిళలు ఫోన్ ద్వారా తమకు చెబితే భార్యాభర్తలను వారికి అందుబాటులో ఉన్న కేంద్రానికి పిలిపించి కౌన్సెలింగ్ నిర్వహిస్తామని తెలిపారు. పోక్సో చట్టం కింద నమోదైన కేసుల్లో బాధితులకు న్యాయం జరిగేందుకు వీలుగా బాల మిత్ర పేరుతో ప్రత్యేక కోర్టుకు వస్తున్న వారికీ ఈ కేంద్రం ధైర్యం చెబుతోంది.
ఇదీ చూడండి : ఒక టీచర్.. 25 పాఠశాలలు.. రూ.కోటి వేతనం