కరోనా మహమ్మారి కారణంగా ఏడాది పాటు వాయిదా పడ్డ టోక్యో ఒలింపిక్స్.. వచ్చే జులైలో ఆరంభమయ్యే అవకాశాలున్నాయని జపాన్ మీడియా ఆదివారం ప్రకటించింది. ప్రాణాంతక ఈ వైరస్ సృష్టిస్తోన్న విపత్కర పరిస్థితులను దాటి ఒలింపిక్స్ కోసం సిద్ధం కావాలంటే సమయం పడుతుందని రాసుకొచ్చింది. కాబట్టి వచ్చే ఏడాది జులై 23న ఈ మెగా క్రీడలను ఆరంభించే వీలుందని ఆ దేశ ప్రజా ప్రసారమాధ్యమం ఎన్హెచ్కే పేర్కొంది.
తక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యే రోజుల్లో క్రీడలను నిర్వహిస్తే మారథాన్ లాంటి రేసుల్లో పాల్గొనే అథ్లెట్లకు ప్రయోజనం చేకూరుతుందని టోక్యో గవర్నర్ యురికో ఇటీవలే చెప్పారు. మరోవైపు క్రీడల నిర్వహణ తేదీలపై స్పష్టత కోసం అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఓసీ)తో యొషిరో సారథ్యంలోని టోక్యో 2020 నిర్వాహక కమిటీ చర్చలు కొనసాగిస్తోంది. దీనిపై మరో వారంలోపు తుది నిర్ణయం వెల్లడించే అవకాశముందని అక్కడి ఓ వార్తపత్రిక ప్రచురించింది. అందుబాటులో ఉన్న అన్ని అవకాశాలను పరిశీలించిన తర్వాతే ఒలింపిక్స్ తేదీలపై ఓ నిర్ణయానికి వస్తామని ఇప్పటికే చెప్పారు ఐఓసీ అధ్యక్షుడు థామస్ బాక్.