ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ ప్రభావం తీవ్రంగా ఉంది. ఇప్పటికే వందల సంఖ్యల మరణాలు నమోదవుతుండగా, ఆ ప్రభావం వచ్చే నెల నుంచి ప్రారంభం కానున్న షూటింగ్ ప్రపంచకప్పైనా పడింది. దిల్లీలో మార్చి 15 నుంచి 26 క్రీడల్లో పాల్గొనకుండా చైనా సహా మరో ఐదు దేశాలు వెనక్కు తగ్గాయి. ఈ విషయాన్ని జాతీయ రైఫిల్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు రనీందర్ సింగ్ స్పష్టం చేశారు.
"ఈ టోర్నీకి కొన్ని దేశాలు రావాల్సి ఉంది. కానీ కరోనా ప్రభావం కారణంగా వారు పాల్గొనడం లేదు. తమ దేశంలో వైరస్ వ్యాప్తి చెందుతుండటం వల్ల స్వతహాగా చైనా ఈ నిర్ణయం తీసుకుంది. వీరితో పాటు తైవాన్, హాంగ్కాంగ్, మకావు, ఉత్తర కొరియా, తుర్కమెనిస్థాన్ ఈ జాబితాలో ఉన్నాయి" -రనీందర్ సింగ్, ఎన్ఆర్ఏఐ అధ్యక్షుడు
ఈనెల ప్రారంభంలో ఆసియన్ రెజ్లింగ్ ఛాంపియన్షిప్లో బరిలోకి దిగాల్సిన కొందరు చైనా రెజ్లర్లకు, భారత ప్రభుత్వం వీసా ఇచ్చేందుకు నిరాకరించింది. ఈ టోర్నీలో పాకిస్థాన్ షూటర్లు పాల్గొనట్లేదని చెప్పారు ఎన్ఆర్ఏఐ అధ్యక్షుడు.