Rudi Koertzen Died: దక్షిణాఫ్రికాకు చెందిన దిగ్గజ క్రికెట్ మాజీ అంపైర్ రూడి కొయిర్ట్జెన్ ప్రాణాలు కోల్పోయారు. మంగళవారం ఉదయం జరిగిన కారు ప్రమాదంలో ఆయన చనిపోయినట్లు స్థానిక వెబ్సైట్ పేర్కొంది. 73 ఏళ్ల కొయిర్ట్జెన్.. దాదాపు 400 అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్లకు అంపైర్గా పనిచేశారు. 1990-2010 మధ్య గొప్ప అంపైర్గా పేరుగాంచారు. కొయిర్ట్జెన్కు భార్య, నలుగురు పిల్లలు ఉన్నారు.
రివర్స్డేల్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆయనతో సహా మరో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. కేప్ టౌన్లో గోల్ఫ్ వీకెండ్ ముగించుకొని.. ఇంటికి తిరుగు పయనమైన సమయంలో ఈ దుర్ఘటన జరిగింది. తన తండ్రి మరణవార్తను రూడి కొయిర్ట్జెన్ జూనియర్ ధ్రువీకరించారు. కొయిర్ట్జెన్ మృతి పట్ల ప్రస్తుత, మాజీ క్రికెటర్లు, అంపైర్లు విచారం వ్యక్తం చేస్తున్నారు. ఆయన కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి ప్రకటిస్తున్నారు.
కొయిర్ట్జెన్ 2002లో ఐసీసీ ఎలైట్ ప్యానెల్లో చోటు సంపాదించారు. దాదాపు ఎనిమిదేళ్లు ఈ హోదాలో కొనసాగారు. మొత్తం తన కెరీర్లో 397 మ్యాచ్లకు ఆన్ ఫీల్డ్ అండ్ టీవీ అంపైర్గా ఉన్నారు. ఇందులో 128 టెస్టులు, 250 వన్డేలు, 19 టీ-20లు ఉన్నాయి.
ఈ దిగ్గజ అంపైర్ కొన్ని వివాదాల్లోనూ చిక్కుకున్నారు. ఆస్ట్రేలియా, శ్రీలంక మధ్య జరిగిన 2007 వన్డే ప్రపంచకప్ ఫైనల్ను.. వెలుతురు సరిగా లేకున్నా నిర్వహించారన్న ఆరోపణ ఉంది. ఐసీసీ నిబంధనను అతిక్రమించిన కారణంగా.. అదే ఏడాది తన సొంత దేశంలో జరిగిన తొలి టీ-20 ప్రపంచ కప్లో.. కొయిర్ట్జెన్ను ఐసీసీ పక్కనబెట్టింది.
ఇవీ చూడండి: పంత్పై రోహిత్ ఫైర్.. ఎందుకంటే?
టీమ్ఇండియాకు బిగ్ షాక్.. ఆసియా కప్కు స్టార్ ప్లేయర్ దూరం