ప్రపంచాన్ని గడగడలాడిస్తోన్న కరోనా వైరస్ బారిన పడిన మొట్టమొదటి పేషెంట్గా భావిస్తున్న వ్యక్తి ఆచూకీని ఎట్టకేలకు కనుగొన్నారు. ఈ వైరస్ ఇప్పుడు మహమ్మారిగా మారి దాదాపు 30వేల మంది ప్రాణాలను బలిగొంది. అమెరికాకు చెందిన ఆంగ్ల పత్రిక వాల్స్ట్రీట్ జర్నల్ ఈమె ఆచూకీని కనుగొంది. నెలరోజుల పాటు ఆసుపత్రిలో చికిత్స అనంతరం ఆమె ప్రాణాలతో బయటపడింది.
వుహాన్లోని హునన్ సముద్రజీవుల మార్కెట్లో రొయ్యలను విక్రయించే వుయ్ జూషాన్ తొలిసారి కొవిడ్-19 లక్షణాలతో డిసెంబర్10న ఆసుపత్రికి వెళ్లింది. ఆమెకు తీవ్రమైన జలుబు చేసిందని భావించిన స్థానిక ఆసుపత్రి వైద్యులు ఒక ఇంజెక్షన్ చేసి ఇంటికి పంపించారు. కానీ, ఆమె క్రమంగా బలహీనంగా మారిపోవడం వల్ల వుహాన్లోని ఎలవెన్త్ హాస్పటల్కు వెళ్లారు. కానీ ప్రయోజనం లేకపోవడం వల్ల డిసెంబర్ 16న ఆ ప్రాంతంలోనే అతిపెద్దదైన వుహాన్ యూనియన్ ఆసుపత్రిలో చేరారు. ఆమెకు ప్రమాదకరమైన జబ్బు వచ్చిందని వారు చెప్పారు. అదే సమయంలో హునన్ మార్కెట్ నుంచి చాలా మంది అటువంటి లక్షణాలతోనే అక్కడకు వచ్చారు. ఫలితంగా కరోనా వైరస్ సోకిందని గుర్తించిన డాక్టర్లు ఆమెను క్వారంటైన్లో ఉంచారు. ఆ మార్కెట్ను వెంటనే మూసివేయించారు.
జనవరిలో కోలుకొని..
కొన్నాళ్లు క్వారంటైన్లో ఉన్న తర్వాత జనవరి నెలలో జుషాన్ కోలుకొంది. ఆమె ఆ మార్కెట్లోని ఒక మరుగుదొడ్డిని వినియోగించడం వల్ల ఈ వ్యాధి వచ్చినట్లు చెబుతోంది. దీనిని మిగిలిన మాంసం విక్రేతలు కూడా వినియోగిస్తారు. వుహాన్ మున్సిపల్ హెల్త్ కమిషన్ కథనం ప్రకారం కొవిడ్-19ను తొలుత గుర్తించిన తొలి27 మందిలో 24 మంది అదే మార్కెట్ నుంచి వచ్చారు. ప్రభుత్వం ముందే స్పందిస్తే మృతుల సంఖ్య ఇంకా తగ్గేదని ఆమె చెబుతోంది.
మానవులకు సోకే ఐదోరకం కరోనావైరస్గా దీనిని గుర్తించారు. ఈ వైరస్లు ప్రస్తుతం ఉన్న ప్రాణి నుంచి పూర్తిగా భిన్నమైన ప్రాణిలోకి చేరి నివాసం ఏర్పాటు చేసుకోగలవు. ఈ పరిశోధనను ది స్కూల్ లైఫ్ అండ్ ఎన్విరాన్మెంట్ సైన్సెస్, స్కూల్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, యూనివర్శిటీ ఆఫ్ సిడ్నీ, చైనాలోని ప్రొఫెసర్లు నిర్వహించిన అధ్యయనం ఆధారంగా ఈ పత్రాన్ని వాల్స్ట్రీట్ తయారు చేసింది.
ఇదీ చూడండి : కరోనా పంజా: శ్రీలంకలో తొలి మరణం