దేశీయంగా కరోనా వ్యాక్సిన్లు అభివృద్ధి చేసిన మూడో దేశంగా టర్కీ నిలిచిందని ప్రకటించారు ఆ దేశ అధ్యక్షుడు రిసెప్ తయీప్ ఎర్డోగాన్. తమ దేశం కన్నా ముందు అమెరికా, చైనా మాత్రమే స్థానికంగా వ్యాక్సిన్లు అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు. వాయవ్య రాష్ట్రం కోకలీలో.. టర్కీ శాస్త్రీయ, సాంకేతిక పరిశోధన మండలి (టీయూబీఐటీఏకే) కేంద్రాల ప్రారంభోత్సవంలో ఈ మేరకు వెల్లడించారు ఎర్డోగాన్.
" టీయూబీఐటీఏకే ఏర్పాటు చేసిన కొవిడ్-19 విభాగం.. ప్రస్తుతం 8 రకాల వ్యాక్సిన్లు, 10 రకాల ఔషధాలపై పని చేస్తోంది. ప్రభుత్వ, ప్రైవేటు రంగాలు, విశ్వవిద్యాలయాల భాగస్వామ్యంతో కరోనా కట్టడికి వ్యాక్సిన్లు, ఔషధాలను అభివృద్ధి చేయటంలో గణనీయమైన పురోగతి సాధించాం."
- రిసెప్ తయీప్ ఎర్డోగాన్, టర్కీ అధ్యక్షుడు
ప్రస్తుతం రెండు వ్యాక్సిన్లు జంతువులపై పరీక్షలను పూర్తి చేశాయని, మనుషులపై క్లినికల్ ట్రయల్స్కు మరో టీకాకు అనుమతులు లభించినట్లు తెలిపారు ఎర్డోగాన్.
టర్కీలో కరోనా మహమ్మారి వ్యాప్తి కొనసాగుతోంది. దేశవ్యాప్తంగా 2,39,622 కేసులు నమోదయ్యాయి. 5,829మంది ప్రాణాలు కోల్పోయారు.
ఇదీ చూడండి: కరోనా నియంత్రణ కష్టమే: డబ్ల్యూహెచ్ఓ