మోడెర్నా కొవిడ్-19 టీకాను స్వీకరించిన ఓ వైద్యుడికి తీవ్ర అలర్జీ లక్షణాలు కనిపించినట్లు అమెరికన్ మీడియా వెల్లడించింది. బోస్టన్కు చెందిన ఆ వైద్యుడికి అంతకు ముందే షెల్ఫిష్ అలర్జీ ఉండటం గమనార్హం.
ఇటీవల బోస్టన్ మెడికల్ సెంటర్కు చెందిన జెరియాట్రిక్ ఆంకాలజీ వైద్యుడు హొస్సీన్ సదర్జాదేహ్ మోడెర్నా టీకా వేయించుకున్నారు. ఆ వెంటనే తనకు తీవ్ర ప్రతిస్పందనలు కలిగాయని ఆ వైద్యుడు వెల్లడించారు. మైకం కమ్మేసినట్లు, గుండె వేగంగా కొట్టుకున్నట్లు అనిపించిందని తెలిపారు. మోడెర్నా టీకా దేశవ్యాప్త పంపిణీ ప్రారంభమైన తరవాత వెలుగులోకి వచ్చిన సీరియస్ కేసు ఇది. దీనిపై బోస్టన్ మెడికల్ సెంటర్ ఒక ప్రకటన విడుదల చేసింది. 'ఆ వైద్యుడికి వచ్చిన అలర్జీకి సంబంధించి వెంటనే చికిత్స చేయించుకున్నారు. ఎమర్జెన్సీ విభాగానికి తరలించి ఆయన అనారోగ్యానికి గల కారణాలను విశ్లేషించాం. ప్రస్తుతం ఆయన బాగానే ఉన్నారు' అని పేర్కొంది.