హీరాగోల్డ్ కేసులో నౌహీరా షేక్ సహా 28 మందిపై ఈడీ అభియోగ పత్రం దాఖలు చేసింది. లాభాల్లో వాటా ఆశ చూపి సుమారు లక్ష 72 వేల మందిని మోసం చేసినట్లు ఈడీ దర్యాప్తులో తేలింది. దాదాపు రూ.5.600 కోట్ల మేర మోసం చేసినట్లు పేర్కొంది.
హైదరాబాద్ సీసీఎస్ పోలీసుల కేసు ఆధారంగా ఈడీ విచారణ జరుపుతోంది. నౌహీరా షేక్, ఇతర నిందితులకు దేశ విదేశాల్లో 250కి పైగా బ్యాంకు ఖాతాలు ఉన్నట్లు గుర్తించింది. సౌదీ అరేబియా, యూఏఈలో 8 బ్యాంక్ ఖాతాలను ఉన్నట్లు దర్యాప్తులో తేలింది.
ఈ కేసులో ఇప్పటికే సుమారు రూ. 299 కోట్ల విలువైన ఆస్తులను ఈడీ జప్తు చేసింది. టోలిచౌకిలో 81 ప్లాట్లను తన ఆధీనంలోకి తీసుకుంది. నిందితులను మనీలాండరింగ్ నిరోధక చట్టం కింద శిక్షించాలని ఛార్జిషీట్లో ఈడీ కోరింది.