రాజ్యాంగ నిర్మాత డా. బీఆర్ అంబేడ్కర్ పేరును నూతనంగా నిర్మించే పార్లమెంట్ భవనానికి మోదీ ప్రభుత్వం పెట్టాలని కేంద్ర మాజీ మంత్రి సర్వే సత్యనారాయణ కోరారు. ఈ విషయమై.. అఖిల భారత షెడ్యూల్డ్ కులాల, తెగల సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడు మహేశ్వర్ రాజ్ సర్వేని ఆయన నివాసంలో కలిశారు. సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడు ఆధ్వర్యంలో ప్రతినిధుల బృందం నూతన పార్లమెంట్కు రాజ్యాంగ నిర్మాత పేరును పెట్టాలనే విషయమై ఆయనతో చర్చించారు.
ప్రపంచంలోనే..
దేశానికి ప్రపంచంలోనే అత్యోన్నత రాజ్యాంగాన్ని అందించిన మహానుభావుడు అంబేడ్కర్ అని పేర్కొన్న సర్వే.. అన్ని వర్గాల ప్రజలకు రాజ్యాంగంలో సముచిత స్థానం కల్పించారన్నారు. పార్లమెంట్ భవనానికి అంబెడ్కర్ పేరు పెట్టాలని కోట్ల మంది ప్రజల డిమాండ్ అని చెప్పారు.
ఒత్తిడి తీసుకురావాలని..
రాజ్యాంగ నిర్మాత పేరును పార్లమెంట్ భవనానికి పెట్టాలని ప్రతి ఎంపీని కలవనున్నట్లు సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడు మహేశ్వర్ రాజ్ పేర్కొన్నారు. ఎస్సీ, ఎస్టీ పార్లమెంటు సభ్యులు శీతకాల సమావేశంలో ఈ విషయమై చర్చించి కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం దిగిరకపోతే దేశవ్యాప్తంగా అన్ని కుల సంఘాలను ఏకం చేసి ఉద్యమాన్ని ఉద్ధృతం చేస్తామని ఆయన హెచ్చరించారు.
ఇదీ చదవండి: ఆస్పత్రి భవనంపై నుంచి దూకి కొవిడ్ రోగి ఆత్మహత్య