గత 12 నెలల్లో 59 శాతం మంది భారత వయోజనులు (అడల్ట్స్) సైబర్ దాడులను ఎదుర్కొన్నట్లు ఓ సర్వే వెల్లడించింది. నార్టన్లైఫ్లాక్ అనే సైబర్ సెక్యూరిటీ సంస్థ ఈ నివేదిక విడుదల చేసింది. దీని ప్రకారం.. సైబర్ దాడుల బారిన పడిన వారంతా.. ఆ సమస్య నుంచి బయటపడేందుకు దాదాపు 1.3 బిలియన్ గంటల సమయాన్ని కేటాయించినట్లు తెలిసింది.
హారీస్ పోల్తో కలిసి సంయుక్తంగా నిర్వహించిన సర్వే ఫలితాల ఆధారంగా నివేదిక రూపొందించింది నార్టన్. ఈ సర్వేలో ప్రపంచవ్యాప్తంగా 10 వేల మంది వయోజనులు (భారత్లో 1000 మంది) పాల్గొన్నారు.
సర్వేలో తేలిన విషయాలు..
గత 12 నెలల్లో తమ డివైజ్లు, ఖాతాల్లోకి అనధికారిక యాక్సెస్లను గుర్తించినట్లు 36 శాతం మంది భారతీయులు తెలిపారు. ఇందులో దాదాపు సగం మంది (49 శాతం) ఈ విషయం పట్ల ఆందోళనకు గురైనట్లు పేర్కొన్నారు.
అనధికారిక యాక్సెస్ ఘటనతో 36 శాతం మంది మాత్రమే సాఫ్ట్వేర్ సెక్యూరిటీ, అప్డేట్స్ చేసుకోవడం, కొత్త యాంటీ వైరస్లను కొనుగోలు చేయడం వంటివి చేశారు. 52 శాతం మంది తమ స్నేహితుల సలహాలను తీసుకున్నారు. 47 శాతం మంది సంబంధిత కంపెనీని (ల్యాప్టాప్, కంప్యూటర్ల కంపెనీ లాంటివి) సంప్రదించారు.
వర్క్ ఫ్రం హోం వల్ల హ్యాకర్లకు తమ డేటాను చోరీ చేయడం సులభతరమైనట్లు 10లో 7 మంది అభిప్రాయపడ్డారు. సైబర్ దాడుల గురించి గతంలో కంటే ప్రస్తుతం తీవ్ర ఆందోళన చెందుతున్నట్లు మూడింటి రెండోంతుల మంది వివరించారు.
75 శాతం మంది భారతీయ వయోజనులు డేటా గోప్యతపై ఆందోళన చెందుతున్నారు. 76 శాతం మంది డేటా భద్రతకు మెరుగైన మార్గాలపై దృష్టి సారించారు. 90 శాతం మంది ఇప్పటికే తమ డేటా రక్షణ కోసం చర్యలు ప్రారంభించారు. పాస్వర్డ్లను మార్చుకోవడం (43 శాతం), సోషల్ మీడియాలో పోస్ట్ చేసే వివరాలను పరిమితం చేసుకోవడం (36 శాతం) ఇందులో ముఖ్యమైనవి.
ఇదీ చదవండి:సాఫ్ట్వేర్ ఎగుమతులు రూ.5.01 లక్షల కోట్లు