కరోనా మహమ్మారితో ఐటీ ఉద్యోగాల తీరు మారింది. సంస్థలు తమ ఉద్యోగులకు ఇంటి నుంచి పనిచేసే వెసులుబాటు కల్పించాయి. ఇదే సమయంలో కంపెనీలకు విదేశాల నుంచి వస్తున్న ప్రాజెక్టులూ పెరుగుతున్నాయి. వచ్చే ఆర్థిక సంవత్సరంలోనూ ఇవి అధికంగా ఉండే అవకాశం ఉందనే అంచనాలున్నాయి. దీనికి తగ్గట్టే ప్రముఖ ఐటీ సంస్థలు తమ ఉద్యోగుల సంఖ్యను పెంచుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి. ప్రస్తుత నిపుణులను అట్టేపెట్టుకునేందుకు బోనస్లు, వేతన పెంపును అమలు చేస్తున్నాయి.
కొవిడ్-19 తర్వాత వేగంగా కోలుకున్న రంగాల్లో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఒకటి. దీనికి ప్రధాన కారణం.. అనేక సంస్థలు తమ వ్యాపారాలను డిజిటల్ రూపంలోకి మార్చేందుకు ప్రయత్నించడమే. దేశీయ ఐటీ దిగ్గజాలైన టీసీఎస్, విప్రో, ఇన్ఫోసిస్, కాగ్నిజెంట్ టెక్నాలజీస్, హెచ్సీఎల్ టెక్నాలజీస్ లాంటి సంస్థలు ఈ అవకాశాన్ని పూర్తిగా చేజిక్కించుకునేందుకు పోటీ పడుతున్నాయి. ఈ సంస్థల ఆఫ్షోర్ ఆదాయాలు 5 శాతం వరకు వృద్ధి చెందే అవకాశాలున్నాయని అంచనా. 2022-23 ఆర్థిక సంవత్సరం చివరి నాటికి ఈ ఐదు సంస్థలూ కలిసి దాదాపు 1,50,000 మంది ఐటీ నిపుణులను నియమించుకుంటాయని కొన్ని సంస్థల అధ్యయనంలో తేలింది. 2012 తర్వాత ఇంత భారీ ఎత్తున నియామకాలు ఇప్పుడే జరుగుతున్నాయని అవి పేర్కొంటున్నాయి.
తక్కువ ఖర్చుతో పూర్తిచేయడంపై విదేశీ సంస్థల దృష్టి: కొవిడ్ వల్ల అమెరికాతో సహా పలు దేశాల్లో చాలా సంస్థలు గతేడాది మూతపడ్డాయి. అవన్నీ ఇప్పుడు తిరిగి తమ వ్యాపారాలు ప్రారంభించేందుకు సిద్ధమవుతున్నాయి. తక్కువ బడ్జెట్లోనూ డిజిటల్ కార్యకలాపాలు సాకారం చేసుకునేందుకు మూడోపార్టీ సేవలపై ఆధారపడుతున్నాయి. అందుకే, భారత్లోని సంస్థలపై అవి దృష్టి సారిస్తున్నాయి. తమ ప్రాజెక్టులను ఇక్కడి సంస్థలకు అప్పగిస్తున్నాయి. ఆఫ్షోర్ ప్రాజెక్టులు పెరగడానికి ఇది ప్రధాన కారణంగా ఐటీ నిపుణులు పేర్కొంటున్నారు.
నిపుణుల లభ్యత
ప్రస్తుతం కొత్త తరం డిజిటల్ టెక్నాలజీలకు గిరాకీ అధికంగా ఉంటోంది. సంస్థలు కృత్రిమ మేధ (ఏఐ), యంత్ర అభ్యాసం (మెషిన్ లెర్నింగ్) తదితర సాంకేతికలపై దృష్టి పెడుతున్నాయి. 'అమెరికాలో ప్రస్తుతం ఈ కొత్తతరం డిజిటల్ టెక్నాలజీ నిపుణులు 5శాతం వరకే ఉన్నారు. మూడు, నాలుగేళ్ల క్రితం మనదగ్గరా ఈ నిపుణుల సంఖ్య అంతే ఉండేది. ఇప్పుడు 25% వరకు వీరి లభ్యత ఉందని సమాచారం. పైగా విదేశాలతో పోలిస్తే, మన నిపుణులపై చేస్తున్న ఖర్చు తక్కువే'నని హైదరాబాద్ సాఫ్ట్వేర్ ఎంటర్ప్రైజెస్ అసోసియేషన్ (హైసియా) అధ్యక్షుడు భరణి కె అరోల్ తెలిపారు. అందుకే పలు కంపెనీలు తమ సేవలను వేగంగా మార్కెట్లోకి తీసుకురావడానికి మన నిపుణుల సహాయాన్నే తీసుకుంటున్నాయని ఆయన పేర్కొన్నారు. ఇటీవల కాలంలో పలు దేశీయ ఐటీ సంస్థలు.. 100 కోట్ల డాలర్లు, అంతకుమించిన ప్రాజెక్టులకు సంబంధించి పలు ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. ఇవి ఎక్కువగా అమెరికా, ఐరోపా దేశాల నుంచే ఉన్నాయని పరిశ్రమ వర్గాలు వెల్లడించాయి.
వేతనాల పెంపు.. బోనస్లు..
ఐటీ సంస్థలకు ఆన్సైట్ ప్రాజెక్టులతో పోలిస్తే.. ఆఫ్షోర్ ప్రాజెక్టులతో ఆదాయం తక్కువగానే ఉంటుంది. కానీ, ఇతర ఖర్చులను పరిగణనలోనికి తీసుకున్నప్పుడు ఐటీ సంస్థలకు ఇది లాభదాయకమే. దీంతో ఉద్యోగులకు ఈ ప్రయోజనాలను బదిలీ చేసేందుకు సంస్థలు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. టీసీఎస్ వచ్చే ఆర్థిక సంవత్సరానికి ఉద్యోగులకు వేతన పెంపును ప్రకటించింది. హెచ్సీఎల్ 10 రోజులకు సమానమైన వేతనాన్ని బోనస్ రూపంలో ఇచ్చింది. యాక్సెంచర్ కూడా ఉద్యోగులకు బోనస్ ఇచ్చింది. కాగ్నిజెంట్ బోనస్తోపాటు, పదోన్నతులనూ ఇస్తున్నట్లు ప్రకటించింది.
ఇదీ చదవండి: 'టీకా ఉత్పత్తిని పెంచేందుకు నిధులివ్వండి!'