ఉత్తరాఖండ్లో విద్యుత్ ఉత్పత్తి చేసే ఎన్నో జల విద్యుత్ ప్రాజెక్టులున్నాయి. వాటిల్లో భగీరథీ నదిపై నిర్మించిన తెహ్రీ డ్యాం.. ఆసియాలోనే అతి పెద్ద జలాశయాల్లో ఒకటి. ఈ ఆనకట్ట నుంచి కొంతకాలంగా భారీ స్థాయిలో మీథేన్ వాయువు వెలువడుతోందని వాడియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ హిమాలయన్ జియోలజీ శాస్త్రవేత్తలు ఇటీవలే గుర్తించారు. అయితే నిర్దుష్టంగా ఎంత మొత్తంలో విడుదలవుతుందో అంచనా వేయవేయలేకపోతున్నారు.
'ట్రేస్ గ్యాస్ ఎనలైజర్' అనే యంత్రంతో రియల్ టైంలో (వాస్తవ సమయంలో) డ్యాం నుంచి విడుదలయ్యే మిథేన్ పరిమాణాన్ని లెక్కించవచ్చని వాడియా శాస్త్రవేత్త డా.సమీర్ తెలిపారు.
మీథేన్ అంటే..
మీథేన్ అనేది ఒక గ్రీన్ హౌస్ వాయువు. అది పర్యావరణం, ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుంది. వాతావరణ మార్పులకు కారణమవుతుంది. దాని వల్ల వచ్చే పొగ, వాయు కాలుష్యంతో ఊపిరితిత్తుల వ్యాధులు సంభవిస్తాయి. అందువల్లే తెహ్రీ ఆనకట్ట, దాని పరిసర ప్రాంతాల్లో సాధారణం కన్నా 2 డిగ్రీల ఉష్ణోగ్రత అధికంగా ఉంటోంది.
గ్రీన్ హౌస్ వాయువులపై అధ్యయనానికి రూ.కోటికి పైగా విలువైన యంత్రాన్ని ఇప్పటికే వినియోగిస్తున్నట్లు డా.సమీర్ తెలిపారు. ఇక, ట్రేస్ గ్యాస్ ఎనలైజర్తో తెహ్రీతో పాటు ఇతర డ్యాంలను పర్యవేక్షించవచ్చన్న ఆయన.. అలాంటి ఓ యంత్రాన్ని దెహ్రాదూన్లోని ఫారెస్ట్ రీసెర్జ్ ఇనిస్టిట్యూట్ కొనుగోలు చేసిందని వెల్లడించారు.
మీథేన్ ఎంతమేర ప్రమాదకరం?
పర్యావరణానికి కార్బన్ డై ఆక్సైడ్(CO2) కన్నా మీథేన్ 20 నుంచి 60 రెట్లు హానికరం. అంటే CO2 కన్నా 60 రెట్లు భూతాపాన్ని పెంచగలదు. అయితే అది వాతావరణంలోకి వెలువడటానికి గల కారణాలను ఇంకా కనుగొనలేదు. ఇప్పటికైతే సహజవాయువు రూపంలో కన్నా ద్రవ రూపంలోనే మీథేన్.. 1500 రెట్లు అధికంగా ఉన్నట్లు శాస్త్రవేత్తలు తెలిపారు.
డ్యాం నుంచి మీథేన్ ఎందుకు వెలువడుతోంది?
"సేంద్రీయ పదార్థాలు కుళ్లిపోవడం వల్ల మీథేన్ విడుదలవుతుంది. వరదలు, విపత్తులు సంభవించినప్పుడు నీటి ప్రవాహం ద్వారా భారీ స్థాయిలో జీవ వ్యర్థాలు డ్యాముల్లోకి చేరుతాయి. కొన్ని నెలలు లేదా ఏళ్లకు అవి కుళ్లిపోయి మీథేన్ గ్యాస్ విడుదలై వాతావరణంలో కలుస్తుంది. డ్యాం ఎంత పెద్దదిగా ఉంటే అంత ఎక్కువ మీథేన్ వాయువు వెలువడుతుంది "
- డా. సమీర్, వాడియా ఇనిస్టిట్యూట్ శాస్త్రవేత్త
అతివృష్టికి ఇదే కారణమా?
అతివృష్టికి ప్రధాన కారణాలపై ఇంకా పరిశోధన జరుగుతోంది. అయితే "పెద్ద మొత్తంలో మీథేన్ వాయువు విడుదలైనప్పుడు ఆ ప్రాంతం, దాని చుట్టుపక్కల ఉష్టోగ్రత పెరుగుతుంది. దీంతో మబ్బులు ప్రభావితమై భారీ వర్షాలు లేదా అతివృష్టి సంభవించవచ్చు" అని డా.సమీర్ వెల్లడించారు. అతివృష్టి రావడంలో డ్యాంల పాత్రపై పరిశోధన జరుగుతోందని తెలిపారు.
తెహ్రీ స్వరూపం..
ఉత్తరాఖండ్లో ప్రధానంగా 12 నదులున్నాయి. వాటిపై తెహ్రీ సహా సహా 32కు పైగా ఆనకట్టలు, విద్యుత్ ప్రాజెక్టులున్నాయి. తెహ్రీ ప్రపంచంలోనే మానవ నిర్మితమైన ఐదో అత్యంత లోతైన డ్యాం. అక్కడ 2400 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి జరుగుతుంది.
ఇదీ చూడండి: కృష్ణా- గోదావరి బేసిన్లో భారీగా మీథేన్!