భాజపా ఎంపీలకు రెండు రోజుల శిక్షణ కార్యక్రమం నిర్వహిస్తున్నారు కమలనాథులు. ఈ కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ, పార్టీ అధ్యక్షుడు అమిత్షా, కార్యనిర్వహక అధ్యక్షుడు జేపీ నడ్డా, సీనియర్ నేత రాజ్నాథ్ సింగ్ సహా సీనియర్ నేతలు పాల్గొంటున్నారు. అభ్యాస్ వర్గ పేరుతో ఏర్పాటు చేసిన ఈ ప్రత్యేక శిక్షణా కార్యక్రమంలో ఎంపీలకు పలు అంశాలపై అగ్రనేతలు దిశానిర్దేశం చేస్తున్నారు.
పార్లమెంట్ లైబ్రరీ భవనంలోని జీఎంసీ బాలయోగి ఆడిటోరియం వేదికగా ఈ శిక్షణా తరగతులు జరుగుతున్నాయి. నమో యాప్పై అవగాహన, పశ్చిమ బంగలో నెలకొన్న పరిస్థితులపై అవగాహన కల్పించడమే ప్రధాన లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ప్రజా సంక్షేమానికి సంబంధించిన అంశాలపై జనాల్లోకి ఎలా వెళ్లాలనే అంశమై ఎంపీలకు సూచనలు చేస్తున్నారు.
'నవ భారతం'పై నడ్డా
'నూతన భారతం-మన ఆలోచనలు' అనే అంశంపై కార్యనిర్వాహక అధ్యక్షుడు జేపీ నడ్డా ప్రసంగిస్తారని తెలుస్తోంది. పార్లమెంటరీ వ్యవహారాలపై పార్టీ ప్రధాన కార్యదర్శి భూపేంద్ర యాదవ్, ఎంపీ నిధులపై అర్జున్ రామ్ మేఘవాల్ మాట్లాడనున్నారు.
నమోపై అమిత్ మాళవ్యా...
నమో యాప్పై పార్టీ జాతీయ ఐటీ కార్యదర్శి అమిత్ మాళవ్యా ప్రసంగం ఉండనుంది.
మోదీ కీలక ప్రసంగం
ఈ రెండు రోజుల సమావేశంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ కీలక ప్రసంగం చేయనున్నారు.
బంగాల్పై బృంద చర్చ
పశ్చిమ బంగలో నెలకొన్న పరిస్థితులు, పార్టీ ఎదుర్కోవాల్సిన విధానంపై ఆగస్టు 4 మధ్యాహ్నం బృంద చర్చ జరగనుంది.
నియోజకవర్గాలపై...
తమ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజా సమస్యలపై ఎంపీలు ఈ సమావేశంలో చర్చించనున్నారు.
ఇదీ చూడండి: 'ప్రత్యేక' తొలగింపునకే అదనపు బలగాలా?