ప్రతిష్టాత్మక నోబెల్ పురస్కారం ఆర్థిక రంగంలో ముగ్గురిని వరించింది. ప్రవాస భారతీయ ఆర్థిక వేత్త అభిజిత్ బెనర్జీ, ఎస్తర్ డఫ్లో, మైకేల్ క్రెమర్లు ఈ అవార్డుకు ఎంపికయ్యారు. అంతర్జాతీయ స్థాయిలో పేదరిక నిర్మూలన కోసం చేసిన కృషికి... అభిజిత్ బెనర్జీ, ఆయన భార్య ఎస్తర్ డఫ్లో, మైకెల్ క్రెమర్లకు సంయుక్తంగా నోబెల్ బహుమతి దక్కింది.
58ఏళ్ల బెనర్జీ.. ముంబయిలో జన్మించారు. కోల్కతా విశ్వవిద్యాలయం, జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీలలో ఉన్నత విద్య అభ్యసించారు. 1988లో హార్వర్డ్ విశ్వవిద్యాలయం నుంచి పీహెచ్డీ పట్టా పొందారు. ప్రస్తుతం మసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో ఎకనమిక్స్ ప్రొఫెసర్గా సేవలందిస్తున్నారు.
2003లో డఫ్లో, సెంధిల్ ములైనాథన్లతో కలిసి అబ్దుల్ లతీఫ్ జమీల్ పవర్టీ యాక్షన్ ల్యాబ్ను ప్రారంభించారు బెనర్జీ . ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి నేతృత్వంలోని అత్యున్నత స్థాయీ సంఘంలోనూ పనిచేశారు.