కడప జిల్లా రైల్వేకోడూరు నియోజకవర్గంలో మరోసారి భారీ వర్షాలు కురుస్తున్నాయి. వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. ఈ క్రమంలో వరదల ధాటికి కడప జిల్లా, రైల్వే కోడూరులోని నరసరాంపేటలో.. నిన్న రెండంతస్తుల భవనం(Building collapsed in Narasarampet) కుప్పకూలింది. సంఘటనా స్థలాన్ని తెదేపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బత్యాల చెంగలరాయుడు పరిశీలించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఇక్కడ ప్రొటెక్షన్ వాల్ నిర్మించేందుకు 2013లోనే రూ.21కోట్ల 87 లక్షలు మంజూరు చేసిన జీవోను.. వైకాపా ప్రభుత్వం వచ్చిన వెంటనే రద్దు చేసిందని బత్యాల చెంగలరాయుడు ఆరోపించారు. తద్వారా.. నరసరాంపేట, శాంతినగర్, ధర్మపురం గ్రామాల్లో ఇళ్లు దెబ్బ తినడానికి, కొట్టుకుపోవడానికి ఇప్పుడున్న ప్రభుత్వమే కారణమని అన్నారు.
తెదేపా ప్రభుత్వంలో నిధులు మంజూరు చేసిన జీవోను ఎందుకు రద్దు చేశారని ప్రశ్నించారు. ఓట్లు వేసిన పాపానికి జనాల ఇళ్లు కొట్టుకుపోతున్నాయన్నారు. ప్రొటెక్షన్ వాల్ నిర్మించి ఉంటే.. ఏరు సమీపంలో ఉన్న ఇళ్లు సురక్షితంగా ఉండేవని అన్నారు.
భారీ వర్షాలు..
కడప జిల్లాలో గత రెండు రోజుల నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. బద్వేల్లో ఆదివారం మధ్యాహ్నం భారీ వర్షం కురిసింది. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. దీంతో జనజీవనం స్తంభించింది. రామాంజనేయ నగర్ సిద్ధవటం రోడ్డులో ఉన్న ఆర్టీసీ గ్యారేజ్ విద్యుత్ కేంద్రంలోకి వర్షపు నీరు చేరింది. ఇవాళ మధ్యాహ్నం అరగంటపాటు కుండపోత వర్షం కురవడంతో కడప నగరం మొత్తం జలమయమైంది.
ఇదీ చదవండి: HEAVY RAINS IN KADAPA DISTRICT : ఎడతెరిపి లేని వర్షం.. పొంగి పొర్లుతున్న వాగులు