కడప జిల్లా పుల్లంపేటలోని ఆదర్శ పాఠశాలలో పదో తరగతి విద్యార్థిని ఆత్మహత్యపై... చిన్నారి బంధువులు, విద్యార్థి సంఘాల నాయకులు ఆందోళన చేపట్టారు. విద్యార్థిని కుటుంబసభ్యులు జాతీయ రహదారిపై బైఠాయించి నినాదాలు చేశారు. పాఠశాలలో శివ అనే ఉపాధ్యాయుడు లక్ష్మీప్రసన్నను మందలించాడని... మనస్తాపానికి గురైన ఆత్మహత్యకు పాల్పడిందని మానవ హక్కుల సంఘం జిల్లా నాయకురాలు జయశ్రీ ఆరోపించారు.
తమ బిడ్డ చావుకు కారణమైన వారిని వదిలిపెట్టొద్దని... క్షమాపణ చెప్పాలని లక్ష్మీప్రసన్న బంధువులు డిమాండ్ చేశారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని విద్యార్థిని కుటుంబసభ్యులు డిమాండ్ చేశారు. ఘటనా స్థలానికి చేరుకున్న డీఎస్పీ నారాయణస్వామిరెడ్డి... నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని... సమగ్ర విచారణ జరిపిస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.
ఇదీ చదవండి: విద్యార్థులున్నా... వసతులు సున్నా..!