కడప జిల్లా తొండూరు మండలం తెదేపా జడ్పీటీసీ అభ్యర్థి అరుణమ్మ నామపత్రాలను వైకాపా కార్యకర్తలు చించివేశారు. నామినేషన్ దాఖలు చేయటానికి భర్తతో కలిసి జడ్పీ కార్యాలయం వద్దకు చేరుకున్న అరుణమ్మను వైకాపా కార్యకర్తలు అడ్డుకున్నారు. చేతిలోని పత్రాలను చించివేసి.. ఆమె భర్త కదిరి దస్తగిరి రెడ్డిని అపహరించారని ఆమె ఆరోపించారు. తన భర్త ఎక్కడున్నారో చెప్పాలంటూ కన్నీరు పెట్టుకున్నారు. విషయం తెలుసుకున్న తెదేపా ఎమ్మెల్సీ బీటెక్ రవి జడ్పీ కార్యాలయానికి చేరుకున్నారు. వైకాపా తీరుపై మండిపడ్డారు. నామపత్రాలను చించివేయటమేంటని ప్రశ్నించారు. ఘటనపై జిల్లా కలెక్టర్, ఎస్పీలకు ఫోన్ ద్వారా ఫిర్యాదు చేశారు. రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని కలసి వైకాపా దౌర్జన్యాలపై ఫిర్యాదు చేస్తామని ఆయన స్పష్టం చేశారు.
ఇదీ చదవండి: