కడప జిల్లా చిట్వేలు మండలం తుమ్మకొండలో సుమారు 80 మంది విద్యార్థులు ఉంటారు. వీరికి దగ్గరలో బి.పి. రాచపల్లెలోని ఉన్నత పాఠశాలకు వెళ్లాలంటే.. 3 కిలోమీటర్లు నడవాలి. దారి మధ్యలో వచ్చే వంకను దాటడానికి విద్యార్థులు ఇబ్బందులు పడేవారు. ప్రతిరోజూ వంక దాటే క్రమంలో పిల్లల బట్టలు, బూట్లు తడిచేవి. వర్షాకాలంలో ఈ వంక ఉద్ధృతంగా ప్రవహించడంతో.. విద్యార్థులు పాఠశాలకు సెలవు పెట్టేవారు. అలా సగం రోజులు పాఠశాలకు వెళ్లకుండానే కాలం గడిపేవారు. వారి పరిస్థితిని చూసి.. ఆ గ్రామానికి చెందిన చలపతి చలించాడు. పిల్లల చదువులు ఆగిపోకూడదని నిర్ణయించాడు. తన పిల్లలతో పాటు గ్రామంలోని విద్యార్థులందరూ ఉన్నత చదువులు చదివి మంచి స్థాయికి ఎదగాలని భావించాడు. దారిలో విద్యార్థులకు ఎదురయ్యే సమస్యను పరిష్కరించాలని భావించి.. ఆ వంకపై కట్టెలతో వంతెన నిర్మించాడు.
ఈ రోడ్డులో అడవిని ఆనుకుని వంక ఉంది. ఆ వంకలో వాన వచ్చినప్పుడు మెడ లోతు వరకు నీళ్లు వస్తాయి. పిల్లలు బడికి పోవాలంటే కష్టం. దయచేసి ప్రభుత్వం బ్రిడ్జి కడితే బాగుంటుందని నా కోరిక. పిల్లల కష్టాలను రోజూ చూస్తూనే ఉన్నా. వాళ్ల బాధ చూడలేక వంతెన కట్టాను. నాకూ ముగ్గురు పిల్లలు. నేను సాధారణ కూలీని. వ్యవసాయం చేస్తా. ఎవరైనా పనికి పిలిస్తే కూడా పోతా. అంతేకాకుండా నేను కళాకారుణ్ని. డ్రమ్స్ వాయించగలను. వాటి పని కోసం నెల్లూరు, కడప పోతాను. నా పిల్లలు ఇంటర్ వరకు చదువుకున్నారు. నాకు పిల్లలను చదివించుకునే స్థోమత లేక ఇంటివద్దే ఉన్నారు. -చలపతి
కూతుళ్ల కోసం...
కూలీ పని చేసుకుంటూ జీవనం సాగించే చలపతికి ముగ్గురు కుమార్తెలు. పక్క గ్రామానికి చదువు కోసం వెళ్లే విద్యార్థుల్లో చలపతి కుమార్తెలు కూడా ఉన్నారు. పిల్లలు తడిసిన దుస్తులతో ఇంటికి రావడాన్ని చూసి సరిగ్గా మాటలు కూడా రాని ఆ పేద తండ్రి చలించిపోయేవాడు. అడవికి వెళ్లి.. కట్టెలు తెచ్చి 50 రోజుల్లోనే వంతెన నిర్మించాడు. పొలం గట్టున వృథాగా ఉన్న టెంకాయ మొద్దులను పిల్లర్లుగా మార్చి.. సుమారు 20 అడుగుల పొడవున వంతెన కట్టేశాడు. ఫలితంగా తన కుమార్తెలతో పాటు ఆ ఊరి విద్యార్థులకూ కొంతమేర కష్టాలు తొలగిపోయాయి. వంతెన నిర్మాణంపై విద్యార్థులు, గ్రామస్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
వంతెన నిర్మాణంతోనే తన పని పూర్తయిందని చలపతి భావించలేదు. ప్రతి ఏడాది వరద వచ్చినప్పుడల్లా ఆ వంతెనకు మరమ్మతులు చేస్తున్నాడు. ఆ వంకపై శాశ్వత వంతెన నిర్మించాలని ఎప్పటినుంచో విజ్ఞప్తులు వస్తున్నా పాలకులు పట్టించుకోవడం లేదు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి వంతెన నిర్మించాలని గ్రామస్థులులు, విద్యార్థులు కోరుతున్నారు.
ఇదీ చదవండి: