CBI Enquiry : వైఎస్ భాస్కర్ రెడ్డికి సీబీఐ మరోసారి నోటీసులిచ్చింది. ఫిబ్రవరి 23న విచారణకు రావాలని గతంలో నోటీసులు జారీ చేయగా... తాను రాలేనని సీబీఐకి భాస్కర్రెడ్డి తెలిపారు. దీంతో తాజాగా సీబీఐ నోటీసులు పంపింది. శనివారం ఉదయం 10 గంటలకు కడప సెంట్రల్ జైలు గెస్ట్హౌస్లో జరిగే విచారణకు హాజరుకావాలని తెలిపింది.
దివంగత ముఖ్యమంత్రి సోదరుడు వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో వైఎస్ అవినాష్రెడ్డిని సీబీఐ రెండోసారి విచారించింది. దాదాపు 4.30 గంటల పాటు ఆయన్ను సీబీఐ అధికారులు ప్రశ్నించారు. కేసు దర్యాప్తులో భాగంగా శుక్రవారం ఆయన తన న్యాయవాదులతో కలిసి సీబీఐ విచారణకు హాజరయ్యారు. న్యాయవాదులను కూడా లోపలికి అనుమతించలేదు.. సుదీర్ఘ విచారణ ముగిసిన అనంతరం అవినాష్ రెడ్డి మీడియాతో మాట్లాడారు.
సీబీఐ అడిగిన అన్ని ప్రశ్నలకూ సమాధానం చెప్పానని అవినాష్రెడ్డి తెలిపారు. విజయమ్మ వద్దకు వెళ్లి బెదిరించి వచ్చానని దుష్ప్రచారం చేయడం ఎంతవరకు సబబు? అని ప్రశ్నించారు. తాను దుబాయికి వెళ్లానని తప్పుడు ప్రచారం చేశారని, మీడియా ప్రచారం వల్ల దర్యాప్తుపై ప్రభావం పడుతోందని అన్నారు. ఒక అబద్ధాన్ని సున్నా నుంచి వందకు పెంచేందుకు.. ఒక నిజాన్ని వంద నుంచి సున్నా చేసేందుకు ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు.
విచారణకు మళ్లీ రావాలని సీబీఐ అధికారులు చెప్పలేదని ఒక ప్రశ్నకు సమాధానం ఇచ్చారు. వాస్తవాలను కాకుండా వ్యక్తిని లక్ష్యంగా చేసుకుని విచారణ జరుగుతోందని ఆరోపించిన అవినాష్.. నాకు తెలిసిన నిజాలతో కూడిన విజ్ఞాపన పత్రం ఇచ్చానని చెప్పారు. విజ్ఞాపన పత్రంపై కూలంకషంగా విచారణ చేయాలని కోరానని తెలిపారు.
ఇవీ చదవండి :