భీమవరం పట్టణంలోని 39 వార్డుల్లో 760 మంది వాలంటీర్లు ఉండాలి. వీరిలో కొందరు వివిధ కారణాలతో విధుల నుంచి తప్పుకోగా ప్రస్తుతం 730 మంది పనిచేస్తున్నారు. సాంకేతికత అంశాలపై పట్టున్న సదరు కంప్యూటర్ ఆపరేటర్ విధుల నుంచి తప్పుకొన్న వాలంటీర్ల స్థానంలో తన భార్య, చెల్లెలు, బావమరిది పేర్లను కమిషనర్ లాగిన్ ఐడీ ద్వారా చేర్చి వేతన బిల్లులను సీఎఫ్ఎంఎస్ ద్వారా అందుకుంటున్నట్లు తెలిసింది. గత కొద్ది నెలలుగా ఈ వ్యవహారం సాగుతున్నా సంబంధిత పర్యవేక్షణాధికారులు పట్టించుకోకపోవడం అనుమానాలకు తావిస్తోంది.
పురస్కారాలు కూడా..
ఉత్తమ సేవలందించిన వాలంటీర్లకు ప్రభుత్వం ఉగాది పురస్కారాల పేరిట ప్రోత్సాహక నగదు బహుమతులు ఇచ్చింది. ఈ పురస్కారాలకు ఎంపికైన వారిలోనూ కొందరు బినామీలు ఉన్నట్లు సమాచారం. క్షేత్రస్థాయిలో కష్టపడి పనిచేసిన కొందరు ఎంపికకాకపోగా అసలు ఎప్పుడూ విధుల్లో కనిపించని వారికి పురస్కారాలు రావడంతో తెరవెనుక అక్రమాలు జరుగుతున్నట్లు అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఈ క్రమంలోనే వేతనాల స్వాహా గుట్టు బయటపడినట్లు సమాచారం. ప్రస్తుతం ముగ్గురు బినామీ వాలంటీర్ల పేర్లు బహిర్గతమయ్యాయని, వారిలో ఇద్దరు పట్టణంలో నివాసం ఉండరని తెలుస్తోంది.
విచారణ జరుపుతున్నాం: కమిషనర్
వాలంటీర్లు లేకుండానే వేతనాల బిల్లులు పొందినట్లు ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో ఈ వ్యవహారంపై విచారణ జరుపుతున్నామని పురపాలక కమిషనర్ ఎం.శ్యామల ‘న్యూస్టుడే’కు చెప్పారు. అవకతవకలు జరిగినట్లు విచారణలో వెల్లడైతే బాధ్యులపై తగు చర్యలు తీసుకుంటామన్నారు. విధులకు హాజరుకాకుండా వేతనం పొందిన వారిపై కూడా చర్యలు తప్పవన్నారు.
వారంలో మూడు రోజుల హాజరు..
ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం వాలంటీర్లు నిత్యం సచివాలయాలకు వెళ్లాల్సిన అవసరం లేదు. ఏదైనా పని ఉంటే రావాల్సి ఉంటుంది. లేకపోతే వారంలో మూడు రోజుల హాజరు ఉంటే సరిపోతుంది. వాలంటీర్లపై పర్యవేక్షణకు వార్డు సచివాలయ పరిపాలన విభాగాధికారులు (అడ్మిన్లు) ఉంటారు. ఒక్కో వార్డు సచివాలయం పరిధిలో 15 నుంచి 18 మంది వరకు వాలంటీర్లు ఉంటారు. వీరిలో ఎందరు విధుల్లో ఉన్నారు, ఎందరు వేతనాలు పొందుతున్నారనే దానిపై అడ్మిన్లతో పాటు అధికారుల పర్యవేక్షణ ఉండాలి. బినామీ వాలంటీర్ల వ్యవహారంపై అడ్మిన్లలో కొందరికి అనుమానం వచ్చినా పట్టించుకోలేదనే వాదనలు వినిపిస్తున్నాయి.