ప్రస్తుతం తలసేమియా, సికెల్ సెల్ అనీమియా ప్రాణాంతక వ్యాధులుగా పరిణమించాయి. జన్యు సంబంధమైన ఈ వ్యాధులు.. చిన్నారుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నాయి. పేదలు ఈ వైద్యానికి అయ్యే ఖర్చులు భరించలేక అప్పులపాలవుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో విజయనగరం జిల్లాలోని పార్వతీపురంలో ఐటీడీఏ పరిధిలోని గిరిజనుల కోసం రాష్ట్ర ప్రభుత్వం డే కేర్ సెంటర్ల ఏర్పాటుకు ముందుకొచ్చింది.
తలసేమియా, సికెల్సెల్ అనీమియా రోగుల సంఖ్య నానాటికీ పెరుగుతోంది. దేశవ్యాప్తంగా ఏడాదికి పదివేల మంది ఈ వ్యాధితో జన్మిస్తుంటే, తెలుగు రాష్ట్రాల్లో సుమారు రెండు వేల మంది ఉన్నట్లు ప్రభుత్వ గణాంకాలు చెబుతున్నాయి. ఈ వ్యాధులు చిన్నారుల పాలిట ప్రాణాంతకంగా మారుతున్నాయి. ఒక్కసారి సోకితే.. జీవితాంతం వారిని పీల్చి పిప్పిచేసే రక్త పిశాచి వ్యాధి ఇది. కన్నవారి ద్వారానే ఈ ప్రాణాంతక వ్యాధి సంక్రమిస్తుండటం దురదృష్ణం. దీని బారిన పడినవారిలో క్రమంగా రక్త నిల్వలు పడిపోతాయి. శరీరానికి అవసరమైన మేర హిమోగ్లోబిన్ ఉత్పత్తి కాదు. క్రమంగా రక్తం ఎక్కించడంతో పాటు అన్నిరకాల పరీక్షలు చేయాల్సి ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఐటీడీఏ పరిధిలోని బాధితులకు అండగా నిలవాలని రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించింది. ఇందులో భాగంగా విజయనగరం జిల్లా పార్వతీపురం ఐటీడీఏ పరిధిలో ప్రయోగాత్మకంగా డే కేర్ సెంటర్ ఏర్పాటు చేసింది. - వాగ్దేవి, డే కేర్ సెంటర్ పర్యవేక్షుకురాలు
పార్వతీపురం ఐటీడీఏ పరిధిలో 27వేల 758 మందికి రక్త పరీక్షలు చేయగా.. అందులో 397 మంది సికెల్ సెల్ అనీమియా, తలసేమియాలతో బాధపడుతున్నట్లు గుర్తించారు. ఇందులో 237మంది విద్యార్ధులు, 30మంది యువతులు, 130మంది గర్భిణులు, ముగ్గురు చిన్నారులు ఉన్నారు. వీరిలో 173మంది గిరిజన సంక్షేమ శాఖ ఆశ్రమ పాఠశాలల వసతిగృహాల విద్యార్ధులే. బాధితులకు ఈ డే కేర్ సెంటర్లో రక్తం ఎక్కించి చికిత్స అందిస్తున్నారు. ఇలాంటి బాధితులందరికీ డే కేర్ సెంటర్ ఎంతో ఉపయోగపడుతోందని వైద్యులు చెబుతున్నారు. - వినోద్, డే కెర్ సెంటర్ వైద్యుడు
డే కేర్ సెంటర్ ద్వారా సకాలంలో వైద్యం అందుతోందని బాధితుల కుటుంబ సభ్యులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. తమ ప్రాంతంలో దీనిని నెలకొల్పడం పట్ల పార్వతీపురం పరిసర ప్రాంతాల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రయాణ ఖర్చులు, ఆర్థికభారం కొంతైనా తగ్గుతోందని చెబుతున్నారు.
ఇదీ చదవండి: