తెలుగు మహాకవి గురజాడ అప్పారావు వర్థంతిని విజయనగరంలో నిర్వహించారు. ఆయన స్వగృహంలో చిత్రపటానికి, విగ్రహానికి అధికారులు, సాహితీవేత్తలు, ప్రజాప్రతినిధులు పూలమాలలు వేసి నివాళ్లు అర్పించారు. అనంతరం మహాకవి రచించిన దేశమును ప్రేమించుమన్నా దేశభక్తి గీతాన్ని అధికారులు, ప్రజాప్రతినిధులు, విద్యార్ధులు కలిసి సామూహికంగా ఆలపించారు.
గురజాడ నివాసం నుంచి సత్య కూడలి వరకు మహాకవి వినియోగించిన వస్తువులతో సాహితీ ర్యాలీ నిర్వహించారు. సాహిత్యానికి వన్నె తెచ్చిన గురజాడ, విజయనగరానికి చెందినవారు కావడం అందరకీ గర్వకారణమని సంయుక్త కలెక్టర్ వెంకటరావు కొనియాడారు. ఆయన సాహిత్యాన్ని, జ్ఞాపకాలను పదిలపరిచి, భావితరానికి అందించేందుకు ప్రభుత్వపరంగా కృషి చేస్తామని అన్నారు.
గురజాడ మాట భావితరాలకు బాట అని మాజీ ఎంపీ బొత్స ఝాన్సీలక్ష్మి కొనియాడారు. గురజాడ విశ్వకవి అని, ఆయన రచనలు ప్రపంచానికి ఆదర్శమని పేర్కొన్నారు. గొప్ప సామాజిక స్ఫుహతో, నాటి సాంఘిక దురాచారాలపై ఆయన తన రచనలద్వారా పోరాటం చేశారని చెప్పారు. ఆనాడే మహిళల ఇబ్బందులను అర్ధం చేసుకొని, స్త్రీపాత్రలను ఉదాత్తంగా తీర్చిదిద్దారని అన్నారు. గురజాడ స్ఫూర్తిని కొనసాగించేందుకు, ఆయన రచనలను కళాశాల విద్యార్థులకు మరింత చేరువ చేయాలని సూచించారు. గురజాడ రచనలపై లేజర్షో ఏర్పాటు చేయాలని ఇప్పటికే సాంస్కృతిక శాఖకు ప్రతిపాదనలు పంపించామని ఝాన్సీ తెలిపారు. అనంతరం ప్రముఖ రచయిత గోపాలరావు రచించిన గురజాడ పుస్తకాన్ని ఆవిష్కరించారు.
ఇదీ చదవండి:
ప్రాణాలకు తెగించి.. వెలుగులు నింపాడు