Centurion University E-Autos: సెంచూరియన్ యూనివర్సిటీ...! విజయనగరం జిల్లా నెల్లిమర్ల మండలం టెక్కలి పంచాయతీ పరిధిలో ఉన్న ఈ క్యాంపస్కు.. ఇతర యూనివర్సిటీలతో పోల్చితే ఓ ప్రత్యేకత ఉంది. ఇక్కడ థియరీ కంటే ప్రాక్టీకల్ తరగతులకే అధిక ప్రాధాన్యమిస్తారు. రియల్ ప్రాజెక్టుల్లో విద్యార్థులను భాగస్వామ్యులు చేస్తారు. విద్యార్థులు ఏదైనా ఆవిష్కరణ చేస్తే వాటికి యూనివర్సిటీ మార్కెటింగ్ కల్పిస్తోంది. ఇక్కడ కనిపిస్తున్న ఇ- రిక్షా, ఇ- కార్గొ వాహనాలు రూపొందించింది ఈ విద్యార్థులే.
యూనివర్సిటీ వైస్ ఛాన్స్లర్ ప్రొఫెసర్ జీఎస్ఎన్ రాజు పర్యవేక్షణలో విద్యార్థులు మెుదటగా వీటి నమూనాలు తయారు చేశారు. వాటిని సెంటర్ ఫర్ ఆటోమోటివ్ ఎక్స్పర్టైజ్కు పంపించారు. అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా వీటిని రూపొందించారని ఐ-కాట్ ధ్రువీకరించింది.
"ఐ-కాట్ ధ్రువీకరణకు మేము ప్రయత్నించినపుడు మాకు ఈ-రిక్షా, ఈ-కార్గో రెండు రకాల వాహనాలకు ధ్రువీకరణ లభించింది.రిక్షాలో డ్రైవర్ తో పాటు ఐదుగురు కూర్చొని ప్రయాణించవచ్చు.30 కిలోమీటర్ల వేగంతో 60 నుంచి 80 కిలోమీటర్లు ప్రయాణం కొనసాగించవచ్చు. ఇక కార్గో వాహనం టరస్ లో 5టన్నుల సరుకును తరలించవచ్చు." - సన్ని డయల్, అసోసియేట్ డీన్, సెంచూరియన్ యూనివర్సిటీ
ప్రయాణాలకు సులువుగా ఉన్న ఈ వాహనం పేరు..`స్టాగ్` ఇ-రిక్షా. ఇందులో.. చోదకుడితో పాటు ఐదుగురు కూర్చొవచ్చు. ఒక్కసారి ఛార్జ్ చేస్తే.. 30 కిలోమీటర్ల వేగంతో 60 నుంచి 80 కిలోమీటర్లు ప్రయాణించవచ్చు. కార్గొ వాహనం.. పేరు టరస్. ఇందులో 5టన్నుల సరుకును తరలించవచ్చు. ఈ ప్రాజెక్ట్లో భాగంగా బ్యాటరీ మినహా మిగిలిన అన్ని విభాగాలు యూనివర్సిటీలోనే రూపొందిస్తున్నారు. వీటిని ప్రభుత్వ రాయితీతో కలిపి వినియోగదారులకు సుమారు లక్షా 75 వేలకు అందిస్తున్నారు.
సెంచూరియన్ యూనివర్సిటీ మొదటి విడతగా 300 ఇ-రిక్షాలను తయారు చేసి టాటా గ్రూప్ కి సరఫరా చేశారు. ఆ తరువాత కర్నాటక ప్రభుత్వం ఆధ్వర్యంలో నడుస్తున్న 150 ఐటీఐలకు 450 ఇ- వాహనాలు పంపిణీ చేశారు. ఒడిశాలోని మిషన్ శక్తి కోసం 50 ఈ వాహనాలు అందజేశారు. క్రమంగా వీటికి డిమాండ్ పెరుగుతుండటంతో ఈ ఏడాది మరో 1000 ఇ-రిక్షాలు తయారు చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నారు.
ఈ ప్రాజెక్ట్లో ఇంజనీరింగ్ విభాగానికి సంబంధించిన అధ్యాపకులతోపాటు కంప్యూటర్స్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, మెకానికల్ విభాగానికి చెందిన విద్యార్థులూ పాల్గొన్నారు. తద్వారా.. ఆటో మొబైల్ రంగంలో ప్రాక్టికల్ పరిజ్ఞానంతో పాటు, స్వీయ అనుభవం సాధిస్తున్నామని విద్యార్థులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
ఈ తరహా ప్రాజెక్టులు చేపట్టడం వల్ల విద్యార్థులు సహజంగానే స్కిల్స్ అప్గ్రేడ్ చేసుకునేందుకు అవకాశం ఉంటుంది. ఈ పోటీ ప్రపంచంలో మనం కూడా రాణించవచ్చనే ఆత్మవిశ్వాసం వారికి లభిస్తుందని యూనివర్సిటీ ఛాన్స్లర్ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
"ఇక్కడ మా విద్యార్థులకు థియరీ, రూపకల్పన,టెస్టింగ్, రియబిలిటీ టెస్టింగ్, తయారీ వంటివి చెప్పి మార్కెటింగ్ కి పంపుతాం. ఇదీ బేసిక్ కాన్సెప్ట్. మేము నాలుగు చక్రాల వాహనాలు, రెండు చక్రాల వాహనాలను కూడా తయారు చేయగలము. కానీ మొదటి సారిగా డిమాండ్ ని బట్టి వీటిని సిద్ధం చేశాం. " - ప్రొ. జిఎస్ఎన్ రాజు, వైస్ ఛాన్స్లర్, సెంచూరియన్ యూనివర్సిటీ
క్యాంపస్లోనే విద్యార్థులను ఆవిష్కర్తలుగా మార్చాలన్నది సెంచూరియన్ యూనివర్సిటీ లక్ష్యం. ఇందులో భాగంగా.. సోలార్ ప్యానల్స్ ద్వారా రీఛార్జ్ అయ్యే వాహనాల రూపకల్పనకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది.
ఇదీ చదవండి : పిఠాపురం కుర్రాడి ఆవిష్కరణతో రోడ్డు ప్రమాదాలకు చెక్..!