బాధితుల ఫిర్యాదుపై సరిగా స్పందించకుండా తిరిగి వారినే బెదిరించారన్న ఆరోపణలు రుజువైన కారణంగా.. విశాఖ సైబర్ క్రైమ్ సీఐ గోపీనాథ్, ఎస్సై రవికుమార్లను నగర సీపీ ఆర్కే మీనా సస్పెండ్ చేశారు. సైబర్ క్రైమ్ పోలీసుల కారణంగా తాము మరింత కష్టాల్లోకి కూరుకుపోయామన్న బాధితుల ఫిర్యాదులపై విచారణ చేయించిన అనంతరం చర్యలు తీసుకున్నారు.
వివరాలివి
విశాఖ నగరానికి చెందిన ఓ వ్యక్తి.. డేటింగ్ అంతర్జాల చిరునామా నిర్వాహకుల మాటలు నమ్మి రూ.11.60 లక్షలు చెల్లించాడు. ఆ మొత్తాన్ని తిరిగివ్వాలని కోరగా.. రూ.6 లక్షలిస్తేనే పూర్తి సొమ్ము ఇస్తామని సంస్థ యాజమాన్యం మెలిక పెట్టింది. దీనిపై బాధితుడు సైబర్ క్రైంకు ఫిర్యాదు చేయగా.. సీఐ గోపీనాథ్ స్వీకరించలేదు. పైగా డేటింగ్ సంస్థకు డబ్బులెందుకు ఇచ్చావని.. కేసులో ఏ1గా చూపిస్తానంటూ సీఐ బెదిరించారని బాధితుడు ఆరోపించాడు. ఈ విషయంపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశాడు.
బాధితుని ఫిర్యాదును తీసుకోలేదు
ఎంవీపీ కాలనీకి చెందిన ఓ వ్యక్తి ఆన్లైన్లో ఓ సంస్థకు చెల్లించాల్సిన మొత్తాన్ని మరో సంస్థకు పొరపాటున చెల్లించారు. ఈ విషయంపై సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేయగా.. ఇలాంటివి తీసుకోవటం లేదని సీఐ బదులిచ్చారు. ఈ క్రమంలో బాధితుడు ఉన్నతాధికారులను ఆశ్రయించాడు. తాజాగా మరికొన్ని ఆరోపణలపైనా ఉన్నతాధికారులు ప్రాథమిక విచారణ చేసి వాస్తవాలేనని తేల్చారు. ఈ నేపథ్యంలో సీఐ, ఎస్సైలపై సీపీ చర్య తీసుకున్నారు. విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని హెచ్చరించారు.
మహిళ ఫిర్యాదును పట్టించుకోలేదు
ఓ గుర్తు తెలియని వ్యక్తి తన భర్తకు లేనిపోనివి చెప్పి సంసారంలో చిచ్చు పెడుతున్నారని ఫిర్యాదు చేస్తే సీఐ గోపీనాథ్ పట్టించుకోలేదని ఓ మహిళ ఉన్నతాధికారుల వద్ద ఆవేదన వ్యక్తం చేసింది. ఈ ఘటనపై ఉన్నతాధికారులు విచారణకు ఆదేశించారు.
ఇదీ చూడండి: