కరోనా కాలంలో ప్రాణాలకు తెగించి విధులు నిర్వహించిన కాంట్రాక్ట్ పారిశుద్ధ్య సిబ్బందికి జీతాలు వెంటనే చెల్లించాలని ఆంధ్రప్రదేశ్ మెడికల్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ ప్రధాన కార్యదర్శి జేడీ నాయుడు డిమాండ్ చేశారు. విశాఖ కింగ్ జార్జి ఆసుపత్రి సూపరింటెండెంట్ కార్యాలయం ఎదుట ఏఐటీయూసీ ఆధ్వర్యంలో పారిశుద్ధ్య సిబ్బంది ధర్నా నిర్వహించారు. ప్రభుత్వాస్పత్రుల్లో పనిచేస్తున్న పారిశుద్ధ్య సిబ్బందికి నాలుగు నెలలుగా జీతాలు చెల్లించడం లేదని ఆవేదన చెందారు.
కార్మికుల కుటుంబాలు రోడ్డున పడే పరిస్థితి ఏర్పడిందని జేడీ నాయుడు వాపోయారు. ఇంటి అద్దెలు, కరెంటు బిల్లులు కట్టుకోలేక కుటుంబ పోషణ భారమై దిక్కుతోచని స్థితిలో ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వాస్పత్రుల్లో పని చేస్తున్న పారిశుద్ధ్య సిబ్బందికి జీతాలు చెల్లించే వరకు తమ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. విశాఖ నగరంలోని ప్రభుత్వ ఘోష ఆసుపత్రి, కింగ్ జార్జ్ ఆస్పత్రి, విమ్స్, ఆర్సీడీ ఆసుపత్రి, ప్రభుత్వ మానసిక ఆసుపత్రి, ప్రభుత్వ కంటి ఆసుపత్రిలో పనిచేస్తున్న పారిశుద్ధ్య సిబ్బంది ధర్నాలో పాల్గొన్నారు.
ఇదీ చూడండి: