రాష్ట్ర వ్యాప్తంగా రథసప్తమి వేడుకలు ముగిశాయి. విశాఖలోని అనకాపల్లి మండలం రాజుపాలెంలో సంప్రదాయ పద్దతిలో కుంకుమార్చన, దివ్యహారతి, క్షీరాభిషేకం చేశారు. గుడివాడ ఎమ్మెల్యే అమర్నాథ్, ఎమ్మెల్సీ పప్పల చలపతిరావు పలువురు ప్రముఖులు రాజుపాలెం ఆలయాన్ని దర్శించుకున్నారు. అధిక సంఖ్యలో భక్తులు సూర్యనారాయణ మూర్తిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ప్రకాశం జిల్లా
ప్రకాశం జిల్లా మార్కాపురంలో రథసప్తమి సందర్భంగా వెండి రథోత్సవాన్ని తిలకించేందుకు రాష్ట్రం నలుమూలల నుంచి భక్తులు తరలివచ్చారు. సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు ఈ ఉత్సవాలు కొనసాగాయి. వివిధ రకాల పుష్పాలతో అలంకరించిన శ్రీదేవి భూదేవి సమేత శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి ఉత్సవమూర్తులను రథంపై ప్రతిష్ఠించారు. రాష్ట్ర విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్, ఎమ్మెల్యేలు కుందూరు నాగార్జున రెడ్డి, అన్నా రాంబాబు తదితరులు స్వామిని దర్శించుకుని రథాన్ని లాగి ప్రారంభించారు.
చిత్తూరు జిల్లా
చిత్తూరు జిల్లా శాంతిపురం మండలం నడింపల్లిలోని శ్రీ తిమ్మరాయ స్వామి ఆలయంలో రథసప్తమి సందర్భంగా విశేష పూజలను చేశారు. శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వేంకటేశ్వర స్వామి కల్యాణోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని వీక్షించారు.
కడప జిల్లా
తిరుమల వేంకటేశ్వర స్వామికి తొలి గడపగా పేరుగాంచిన దేవుని కడప శ్రీ లక్ష్మీ వేంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరిగాయి.
నెల్లూరు జిల్లా
రథసప్తమి వేడుకలు నెల్లూరులో వైభవంగా సాగాయి. సూర్యభగవాన్ జయంతిని పురస్కరించుకొని ఈ వేడుకల్లో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. శ్రీ తల్పగిరి రంగనాథస్వామి ఆలయంలో స్వామివారికి సప్తవాహన సేవ కన్నులపండువగా నిర్వహించారు.
కృష్ణాజిల్లా
ఆగిరిపల్లి శ్రీ శోభనాచల వ్యాఘ్ర లక్ష్మీ నరసింహ స్వామి వారి తిరుణాల మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. రథసప్తమి వేడుకలు భక్తకోటి కోలాహలం నడుమ నిర్వాహకులు కొనసాగించారు.