సంక్రాంతి పండుగను ప్రైవేటు ట్రావెల్స్ సొమ్ము చేసుకుంటున్నాయి. ప్రయాణికుల నుంచి ఛార్జీలు భారీగా దండుకుంటున్నాయి. విజయవాడ - హౌరా మార్గంలో కొవిడ్ కారణంగా రైళ్లు పరిమితంగానే తిరుగుతున్నాయి. ఇంకా పూర్తి స్థాయిలో నడవడం లేదు. దీనిని ప్రైవేటు బస్సు ఆపరేటర్లు అవకాశంగా మలచుకుంటున్నారు.
సాధారణం కంటే రెట్టింపు..
పండుగ దగ్గరకొచ్చే కొద్దీ టికెట్ ధరలను పెంచుతూ పోతున్నారు. సాధారణ రోజుల్లోనే వసూలు చేసే దానికన్నా రెట్టింపు తీసుకుంటున్నారు. మూడు రోజుల పాటు నిర్వహించే పెద్ద పండుగ కావడంతో చేసేది లేక ప్రయాసలకోర్చి జనాలు స్వస్థలాలకు వెళ్తున్నారు. కరోనా పేరుతో ఎడాపెడా ధరలను పెంచారు. శానిటైజేషన్, రక్షణ చర్యల పేరుతో ఎక్కువ తీసుకుంటున్నారు. పండగ డిమాండ్ కలవడంతో రెట్టింపు అయింది. విశాఖపట్నంకు సాధారణ రోజుల్లో నాన్-ఏసీ బస్సులకు రూ.550 నుంచి రూ.600 వరకు ఉంటుంది. ఇప్పుడు ఈ ధరను ఏకంగా రూ.900 నుంచి రూ. వెయ్యికి పెంచేశారు. ఏసీ బస్సుల్లో రూ.1,200 నుంచి రూ.1,500 వరకు వసూలు చేస్తున్నారు. స్లీపర్కు అయితే రూ.1,500 నుంచి రూ.2,000 వరకు ఉంది.
ప్రత్యేక డ్రైవ్లో అధికారుల కొరడా..
ప్రైవేటు ట్రావెల్స్ దందా, ఇతర ఉల్లంఘనలపై రవాణా శాఖ అధికారులు దృష్టి సారించారు. ఈనెల 18వ తేదీ వరకు తనిఖీలు నిర్వహంచనున్నారు. సహాయ ఎంవీఐ, ఎంవీఐలతో ప్రత్యేక తనిఖీ బృందాలను ఏర్పాటు చేశారు. అధిక ధరలు, అదనపు సీట్లు, కాంట్రాక్ట్ క్యారేజి పర్మిట్లు తీసుకుని స్టేజి క్యారేజీలుగా తిరుగుతున్న వాటిని, సరకులను అక్రమంగా తరలించడం వంటి వాటిని పరిశీలిస్తున్నారు. విజయవాడ నగరంతో పాటు జిల్లాలోని ముఖ్యమైన ప్రాంతాల్లో నిఘా ఉంచుతున్నారు.
రామవరప్పాడు కూడలి, కనకదుర్గ వారధి, ఇబ్రహీంపట్నంలో మోహరించారు. ఇప్పటి వరకు ప్రత్యేక డ్రైవ్లో మొత్తం 31 కేసులు నమోదు చేశారు. ప్రయాణికులను తీసుకెళ్లాల్సిన బస్సుల్లో సరకులను చేరవేస్తున్నట్లు గుర్తించి 22 ప్రైవేటు బస్సులపై కేసులు పెట్టారు. ప్రభుత్వానికి ఎటువంటి పన్ను చెల్లించకుండానే తిరుగుతున్న ఓ బస్సును సీజ్ చేశారు. చెక్పోస్టుల వద్ద కూడా నిఘా పెట్టినట్లు డీటీసీ పురేంద్ర చెప్పారు. నిబంధనలు ఉల్లంఘించిన వాహనాలను సీజ్ చేసి, కేసులు నమోదు చేస్తామని వివరించారు.
ఇదీ చదవండి: