విశాఖ జిల్లా వాల్తేరులో పోస్టుమ్యాన్ చీటీల పేరుతో టోకరా వేశాడు. సుమారు రూ.1.50 కోట్లతో పరారయ్యాడు. వాల్తేరు రైల్వేస్టేషన్ పోస్టాఫీస్లో పోస్టుమ్యాన్గా పని చేస్తున్న శ్రీనివాసరావు (50) చినవాల్తేరులో నివాసముంటున్నాడు. ప్రతీ నెలా ప్రైవేటు చీటీలు వేస్తుంటాడు. చీటీలు పాడుకున్నాక నగదు ఇవ్వకపోవటంతో ఈ ఏడాది మే నెలలో నాలుగో పట్టణ పోలీసుస్టేషన్లో బాధితులు ఫిర్యాదు చేశారు. పోలీసులు నిందితుడ్ని హెచ్చరించడంతో సెప్టెంబరులో అందరికీ ఇవ్వాల్సిన బకాయిలు చెల్లిస్తానని హామీ ఇచ్చాడు.
ఇటీవల శ్రీనివాసరావు పరారయ్యాడు. 20 రోజులుగా విధులకు హాజరుకావడం లేదు. ఒక్కో ఉద్యోగికి సుమారు రూ.లక్ష నుంచి రూ.5లక్షలకుపైగా చెల్లించాలి. ఇలా సుమారు రూ.1.50 కోట్లు చెల్లించాల్సి ఉందని, శ్రీనివాసరావు తన ఆస్తిని భార్య పేరిట బదలాయించి, చీటీలు పాడుకున్న వారికి ఐపి నోటీసులు పంపినట్లు బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. నిందితుడిని పట్టుకుని తమకు న్యాయం చేయాలని పోలీసులకు బాధితులు ఫిర్యాదు చేశారు.
ఇదీ చదవండి: రాజధానిలో గుండెపోటుతో రైతు మృతి