NTR Centenary Celebrations in Visakha: ఎన్టీఆర్ శత జయంతి వేడుకల సందర్భంగా.. ఎన్టీఆర్ లిటరేచర్, సావనీర్, వెబ్ సైట్ కమిటీ ఛైర్మన్ టీడీ జనార్థన్ ఆధ్వర్యంలో విశాఖలో సమాలోచన కార్యక్రమం జరిగింది. ఎన్టీఆర్ శాసన సభ ప్రసంగాలు, చారిత్రక ప్రసంగాలపై రూపొందించిన మూడు గ్రంథాలపై ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. తెలుగు వారి ఖ్యాతి ప్రపంచానికి చాటిచెప్పిన వ్యక్తి ఎన్టీఆర్ అని కార్యక్రమానికి హాజరైన నేతలు కొనియాడారు.
ఈ సభలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎన్టీఆర్ కుమారుడు రామకృష్ణ మాట్లాడుతూ ఎన్టీఆర్ రాజకీయాలకు రాక ముందే ఎన్నో సేవలు చేశారని చెప్పారు. రాయలసీమ కరువు, దివిసీమ ఉప్పెనలో సహాయం చేశారన్నారు. 9 నెలల్లో పార్టీ పెట్టించి ప్రభుత్వాన్ని స్థాపించారని తెలిపారు. ఎన్టీఆర్ సీఎం అయ్యాక అనేక సంక్షేమ పథకాలు అందించారని అన్నారు. అన్ని దానాలు కంటే అన్నదానం మిన్న అని చెప్పింది ఎన్టీఆర్ అని.. తిరుపతిలో అన్నదానం ప్రవేశ పెట్టింది ఎన్టీఆర్ అని పేర్కొన్నారు. ఎన్టీఆర్ బిడ్డగా ఉండటం తన అదృష్టం అన్నారు.
NTR centenary celebrations: సింగపూర్లో ఘనంగా ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలు.. ముఖ్య అతిథిగా పయ్యావుల
మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు మాట్లాడుతూ తనకు రాజకీయ భిక్ష పెట్టింది ఎన్టీఆర్ అని అన్నారు. పల్లెటూరులో పుట్టిన వాడిని ఈ రోజు ఈ స్థాయి కి తీసుకొచ్చింది ఎన్టీఆర్ చలవే అన్నారు. చదువుకున్న వాళ్లకి టికెట్లు ఇచ్చి గెలిపించారు. తెలుగుదేశం పిలిస్తోంది రా అనే నినాదం సైకిల్కి కట్టుకుని తిరిగితే ఓట్లు వేసి గెలిపించారని చెప్పారు. అప్పటికీ, ఇప్పటికీ ప్రజల్లో చాలా మార్పు వచ్చిందని తెలిపారు.
సమాజాన్ని ఉత్తేజ పరిచే సినిమాలు ఎన్టీఆర్ తీసేవారన్నారు. ఒకే సారి 63 పాలిటెక్నిక్ కాలేజ్లు రాష్ట్రంలో తీసుకొచ్చింది ఎన్టీఆర్ అని.. ఆ రోజుల్లో టెక్నికల్ ఎడ్యుకేషన్కు ప్రాధాన్యత ఇచ్చారని చెప్పారు. డబ్బుల ప్రమేయం లేకుండా ఓట్లు వేసే పరిస్థితులు వస్తే ప్రజాస్వామ్యం బాగుపడుతుందని అన్నారు. కనీసం తప్పును తప్పు అని చెప్పే పరిస్థితి ఇపుడు రాష్ట్రంలో లేదన్నారు. అప్పుడే ఎన్టీఆర్ కలలు కన్న రాజ్యం వస్తుందని అయ్యన్న పాత్రుడు అన్నారు.
మాజీ మంత్రి బండారు సత్యనారాయణ మూర్తి మాట్లాడుతూ ఎన్టీఆర్ ఎప్పుడు ఆప్యాయంగా తమ్ముడు అని పిలిచే వారని, ఒక్క రూపాయి కూడా ఖర్చు చెయ్యకుండా ఎమ్మెల్యేగా గెలిచామన్నారు. ప్రజల్లో తిరిగే వాడు ప్రజా నాయకుడు అని ఎన్టీఆర్ అనే వారని.. ఎన్టీఆర్ ఘన చరిత్రను ఇప్పటి యువతకు తెలియాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని అన్నారు.
బీజేపీ నేత విష్ణు కుమార్ రాజు మాట్లాడుతూ ఎన్టీఆర్ని నేరుగా తాను కలవలేదని తెలుగు వారి ఖ్యాతి ప్రపంచానికి తెలిపిన వ్యక్తి ఎన్టీఆర్ అని.. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉందని అన్నారు. 2019 నుంచి రాష్ట్రంలో దురదృష్టకర పరిస్థితులు వచ్చాయని పేర్కొన్నారు. కానీ జులై 4వ తేదీన అల్లూరి పుట్టిన రోజు నాడు.. ఎన్టీఆర్ కుమార్తె పురందేశ్వరి బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు అయ్యారని చెప్పారు. ఆ రోజు నుంచే రాష్ట్రంలో రోజులు మారాయని అన్నారు. ఈ రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం పోతేనే ఎన్టీఆర్కి నిజమైన నివాళి అని పేర్కొన్నారు.
ఈ గ్రంథ సమీక్షలో ఎన్టీఆర్ కుమారుడు నందమూరి రామకృష్ణ, మాజీ మంత్రులు అయ్యన్న పాత్రుడు, బండారు సత్యనారాయణ మూర్తి, మాజీ ఎమ్మెల్యే విష్ణు కుమార్ రాజు, సీపీఐ మాజీ ఎమ్మెల్యే మానం ఆంజనేయులు.. రాష్ట్ర తెలుగు మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత,ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ బాబు, ఎమ్మెల్సీ దువ్వారపు రామారావు, మాజీ ఎమ్మెల్యేలు పల్లా శ్రీనివాసరావు, గండి బాబ్జి , మాజీ ఎమ్మెల్సీ బుద్ధ నాగ జగదీష్లు పాల్గొన్నారు.