RC15 Movie Shooting in Visakhapatnam: టాలీవుడ్ మెగా పవర్స్టార్ రామ్చరణ్, స్టార్ డైరెక్టర్ శంకర్ కాంబోలో తెరకెక్కుతున్న మూవీ 'ఆర్సీ 15'. ఇప్పటికే పలు ప్రదేశాల్లో శరవేంగా షూటింగ్ పూర్తి చేసుకుంది. ఇప్పుడు ఈ సినిమా చిత్రీకరణను విశాఖలో జరుగుతోంది. విశాఖలోని గీతం కళాశాలకు వచ్చారు. చుట్టూ డాన్సర్ల మధ్య హెలికాప్టర్ నుంచి రామ్చరణ్ దిగుతున్న దృశ్యాలను చిత్రీకరించారు. షూటింగ్ విషయం తెలుసుకుని అభిమానులు భారీగా తరలి వచ్చారు.
కాగా కొద్ది రోజుల క్రితం ఈ సినిమా చిత్రీకరణ కర్నూలులో జరిగింది. కర్నూల్లోని కొండారెడ్డి బురుజు వద్ద షూటింగ్ చేశారు. ఆ సమయంలో కూడా అభిమానులు భారీగా గుమిగూడారు. అంతకు ముందు హైదరాబాద్లోని చార్మినార్ వద్ద షూటింగ్ చేసిన మూవీ టీమ్ ఇప్పుడు విశాఖలో తదుపరి చిత్రీకరణను మొదలుపెట్టింది.
ఇక సినిమా విషయానికి వస్తే.. దిగ్గజ దర్శకుడు శంకర్ దర్శకత్వంలో పొలిటికల్ థ్రిల్లర్గా రూపొందుతోంది 'ఆర్సీ15'. పాన్ ఇండియా స్థాయిలో రూపొందుతోన్న ఈ సినిమాలో కియారా అడ్వాణీ, అంజలితో పాటు ఎస్. జె. సూర్య, నవీన్ చంద్ర, సునీల్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. మరో వైపు చరణ్ ఈ సినిమాలో ద్విపాత్రాభినయం చేస్తున్నారని సమాచారం. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్పై దిల్ రాజు, శిరీష్ ఈ మూవీని నిర్మిస్తున్నారు.
అయితే గత కొంతకాలంగా షూటింగ్కు బ్రేక్ ఇచ్చిన చిత్ర యూనిట్ ఇటీవలే మళ్ళీ కొత్త షెడ్యూల్ను మొదలుపెట్టింది. ఈ క్రమంలో తాజాగా వివిధ ప్రాంతాలలో షూటింగ్స్ చేస్తూ.. చిత్రయూనిట్ వేగం పెంచింది. రామ్చరణ్, దిగ్గజ దర్శకుడు శంకర్ కలయికలో వస్తున్న సినిమా కావడంతో.. దీనిపై అంచనాలు భారీగానే ఉన్నాయి.
ఇవీ చదవండి: