విశాఖ జిల్లా నర్సీపట్నం తదితర ప్రాంతాల్లో రోజురోజుకీ కరోనా కేసులు పెరుగుతున్నాయి. ఈ క్రమంలో ఈరోజు నుంచి నర్సీపట్నం పురపాలక పరిధిలో పాక్షికంగా లాక్డౌన్ విధిస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. ఈ మేరకు పట్టణంలోని వ్యాపారులతో ఆర్డీవో లక్ష్మీ శివజ్యోతి ,మున్సిపల్ కమిషనర్ కృష్ణవేణి, పట్టణ సీఐ స్వామి నాయుడు సమావేశాన్ని నిర్వహించారు.
ఈనెల 17 నుంచి ఆగస్టు నెల వరకు లాక్డౌన్ నిబంధనలు ఉన్నట్లు వ్యాపారులకు తెలిపారు. ఇందుకు సహకరించాలని వ్యాపార వర్గాలను కోరారు. ప్రధానంగా వ్యాపార సంస్థలకు సంబంధించి ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు మాత్రమే వ్యాపారం చేసుకోవాలని సూచించారు. రెస్టారెంట్లకు ఒక గంట పొడిగిస్తూ మూడు గంటల వరకు సమయాన్ని కేటాయించారు. మధ్యాహ్నం రెండు గంటల తర్వాత ఆటోలు, ఇతర ప్రైవేటు వాహనాలు పట్టణంలో ప్రయాణించడాన్ని నిషేధించారు. సెలవురోజుల్లో పూర్తిస్థాయిలో లాక్డౌన్ కొనసాగించే విధంగా అధికారులు చర్యలు చేపట్టారు. ఇందుకు పట్టణంలోని ప్రజలు వ్యాపార సంస్థలు పూర్తిస్థాయిలో సహకరించాలని అధికారులు విజ్ఞప్తి చేశారు.
ఇదీ చదవండి: ఏపీ ప్రభుత్వంపై హైకోర్టు ఆగ్రహం..