విశాఖ జిల్లా దేవరాపల్లి సమీపంలోని శారద నదిపై శిథిలమైన కాలిబాటకు మరమ్మతులు చేపట్టి.. అసంపూర్తిగా ఉన్న వంతెన నిర్మాణ పనులు పూర్తి చేయాలని సీపీఎం ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. కాలిబాటపై పడిన గుంతలో దిగి నాయకులు వినూత్న రీతిలో నిరసన తెలిపారు. అధికారులు స్పందించి తక్షణమే పనులు చేపట్టాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు వెంకన్న మాట్లాడుతూ.. కొన్నేళ్ల క్రితం శారద నదిపై రూ.5 కోట్లతో వంతెన నిర్మాణం చేపట్టారు.అయితే 90 శాతం పనులు పూర్తి చేశారు. నిధులు చాలక గుత్తేదారుడు పనులు రెండేళ్లుగా అసంపూర్తిగా వదిలేశారన్నారు. ఇక్కడ తాత్కాలికంగా నిర్మించిన కాలిబాట ప్రస్తుతం శిథిలం కావడంతో రాకపోకలకు ఇబ్బందులు తలెత్తాయి. ఈ మార్గం నుంచి 4 మండలాలకు చెందిన దాదాపు 200 గిరిజన గ్రామాల ప్రజలు నిత్యం రాకపోకలు సాగిస్తున్నారన్నారు. కాలిబాట ఏమాత్రం కొట్టుకుపోయినా.. 200 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోతాయని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు తక్షణమే స్పందించి కాలిబాటకు మరమ్మతులు చేపట్టి, వంతెన నిర్మాణం పూర్తి చేయాలన్నారు. అధికారులు స్పందించకుంటే పెద్దఎత్తున ఆందోళన చేస్తామని తెలిపారు.
ఇవీ చదవండి