PDF MLC Venkateswara Rao Comments: రాష్ట్రంలోని పాఠశాల విద్యా విధానంలో విధ్వంసకర పరిస్థితులు నెలకొన్నాయని పీడీఎఫ్ ఎమ్మెల్సీ ఐ. వెంకటేశ్వరరావు అన్నారు. శ్రీకాకుళం జిల్లా.. టెక్కలిలో యూటీఎఫ్ ఆధ్వర్యంలో.. ఆదివారం నిర్వహించిన సంక్షేమరాజ్యం - పెన్షన్ విధానం అంశంపై జరిగిన సదస్సులో ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. నాలుగేళ్ల వైఎస్సార్సీపీ పాలనలో ఉద్యోగులకు, అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు, పింఛనుదారులకు చేసిన మేలేమిటని ప్రశ్నించారు. ఉద్యోగులకు పీఆర్సీ అమలు, సకాలంలో డీఏలు చెల్లింపు హామీ ఏమైందని నిలదీశారు. 2019- 24 మధ్య చెల్లించాల్సిన డీఏలు 30 ఏళ్ల తర్వాత పరిపాలనకు వచ్చేవారు చెల్లిస్తారనడంలో ప్రభుత్వ నైతికత, నిజాయితీని ప్రశ్నించారు.
పాఠశాల మూతపడదు, ఉపాధ్యాయ పోస్టు రద్దవదు అని నాడు చెప్పి.. నేడు నూతన విద్యా విధానం నెత్తికెక్కించుకుని విలీనాలు చేసి పాఠశాల విద్యా వ్యవస్థను నీరుగార్చారన్నారు. విద్యార్థులు ప్రభుత్వ బడులనుంచి ప్రైవేటుకు తరలిపోతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. ప్రభుత్వం ఓపీఎస్ మాట మర్చిపోయిందని, హామీల అమలుకు పోరాడుతున్న ఉపాధ్యాయులపై జీవో నంబరు 1తో నిర్బంధ చర్యలకు పూనుకోవడం బ్రిటీష్ పాలనను తలపిస్తోందని ఆరోపించారు. ఎన్ని అడ్డంకులు సృష్టించినా.. ప్రతిఘటన తీవ్రతరమవుతుందని స్పష్టంచేశారు.
"నీ పాలనా కాలంలో చెల్లించాల్సిన డీఏలు రాబోయే వాడి నెత్తి మీద పెట్టడం ఏమిటని ప్రశ్నిస్తున్నాను. 11వ పీఆర్సీ సంబంధించిన ఎరియర్లు.. 30 ఏళ్ల తరువాత పరిపాలనకు వచ్చిన వాడు చెల్లిస్తాడని చెప్పడం.. మోసం కాదా అని నేను ప్రశ్నిస్తున్నాను. పాఠశాల విద్యా రంగంలో 51 వేల టీచర్ల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ప్రతి సంవత్సరం డీఎస్సీ వేస్తానని చెప్పిన మాట ఏమైందని అడుగుతున్నాను. ఉపాధ్యాయుల పోస్టులు తగ్గించి.. నూతన విద్యా విధానం నెత్తిన ఎత్తుకొని.. విలీనం చేసి, ముక్కలు చేసి.. పాఠశాల విద్యా రంగంలో పెద్ద విధ్వంసకర పరిస్థితులు నెలకొన్నాయి. పెన్షన్ విషయంలో ఘోరంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం మాట తప్పింది. ఓట్లు వేయించుకొని.. ఒడ్డెక్కి.. ఓపీఎస్ మాట మరిచిపోయి.. జీపీఎస్ పద్ధతిలో పరిష్కారం అంటూ ఏదో చెప్తోంది. కానీ ఇవేవీ కూడా ఉపాధ్యాయ, విద్యా సంఘాలు అంగీకరించడం లేదని స్పష్టం చేస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీల కోసం పోరాడుతున్న వారి మీద జీవో 1 పేరుతో నిర్బంధమైన చర్యలు తీసుకోవడం.. బ్రిటీష్ పాలనను తలపిస్తోందని స్పష్టం చేస్తున్నాం". - వెంకటేశ్వరరావు, ఎమ్మెల్సీ
ఇవీ చదవండి: