స్తంభించిన రాకపోకలు
శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల నియోజకవర్గం పరిధిలో ఉన్న లావేరు వద్దనున్న బుడుమూరు పెద్ద గెడ్డ ఉద్ధృతంగా ప్రవహించడంతో 10 గ్రామాలకు పూర్తిగా రాకపోకలు నిలిచిపోయాయి. పెద్దరొంపివలస, రాయిలింగారిపేట, నేతేరు, లక్ష్మీపురం, నేదురుపేట గ్రామాలు పూర్తిగా జల దిగ్బంధంలో ఉన్నాయి.
నీట మునిగిన వేల ఎకరాల పంటలు
ఎచ్చెర్ల నియోజకవర్గంలో రెండు వేల ఎకరాల్లో వరి పంట నీట మునిగింది. దీంతోపాటు పత్తి, మొక్కజొన్న, తదితర వాణిజ్య పంటలు సర్వనాశనం అయ్యాయి. పంటలు వర్షాలకు నాశనం కావడంతో రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. తమను ప్రభుత్వమే ఆదుకోవాలని పంట నష్టపోయిన రైతులు కోరుతున్నారు.
నీట మునిగిన ఇళ్లు, దేవాలయాలు, పాఠశాలలు
వజ్రపుకొత్తూరు మండలం నగరంపల్లి, గుల్లలపాడు గ్రామాలను వరదనీరు చుట్టుముట్టింది. దేవాలయాలు, ఇళ్లలోకి నీరు చేరింది. సరుబుజ్జిలి జడ్పీ ఉన్నత పాఠశాల నీట మునిగింది. విద్యార్థులు, ఉపాధ్యాయులు, గ్రామస్థులు ఆవేదన చెందుతున్నారు.
ఉద్ధతృంగా వంశధార, నాగవళి
వర్షాలకు వంశధార, నాగావళి, సువర్ణముఖి, వేగావతి నదులు ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయి. గురువారం నుంచి ఈ నదుల్లో నీటిప్రవాహం పెరుగుతోంది. హిరమండలం గొట్టా బ్యారేజీ నుంచి వచ్చిన నీటిని వచ్చినట్లు వంశధార నది దిగువకు అధికారులు విడుదల చేస్తున్నారు. నదీ పరివాహక ప్రాంతాల్లోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ నివాస్ సూచించారు. అధికారులను కలెక్టర్ అప్రమత్తం చేశారు. మత్స్యకారులు ఎవరూ చేపల వేటకు వెళ్లరాదని హెచ్చరించారు.
కూలిన 150 ఏళ్ల మర్రిచెట్టు
గార కళింగవీధిలోని 150 ఏళ్ళ మర్రిచెట్టు కూలిపోయింది. రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు జనవాసాల మధ్య భారీ వృక్షం నేలకొరగటంతో... చెట్టు కింద ఉన్న టాటా వాటర్ ప్లాంటు భవనంతో పాటు వాటర్ క్యాన్లు రవాణాకు ఉపయోగించే వాహనం పూర్తిగా ధ్వంసమయ్యాయి. అలాగే చెట్టు సమీపంలోని ఇళ్లు పాక్షికంగా దెబ్బతిన్నాయి.
రైళ్ల రాకపోకలకు అంతరాయం
విశాఖ- కొత్తవలస-కిరండోల్ రైలు మార్గంలో కొండ చరియలు విరిగిపడి రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. చిమిడిపల్లి-బొర్రా గుహల మధ్య ఓవర్ హెడ్ పరికరాలు దెబ్బతిన్నాయి. కిరండోల్ ప్యాసింజర్, అరకు-విశాఖ ప్రత్యేక రైలు నిలిచిపోయింది. వానల ధాటికి చోడవరం మండలం గవరవరం వద్ద శారదా నదిపై కాజ్వే కుంగిపోవడంతో చుట్టుపక్కల గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. మన్యం గుమ్మకోట పరిధిలోని ఓ గెడ్డలో బస్సు చిక్కుకుంది. కొండ ప్రాంతాల్లో మట్టి కోతకు గురవుతుండటంతో అక్కడ నివాసం ఉంటున్నవారు ఆందోళన చెందుతున్నారు. ఆయా ప్రాంతాల్లో నగరపాలక సంస్థ అధికారులు పర్యటించి ధైర్యం చెప్పారు.
కృష్ణాజిల్లాలో 4 మండలాల్లో ముంపు
జగ్గయ్యపేట, చందర్లపాడు, తోట్లవల్లూరు, కంచికచర్ల మండలాల్లోని పలు గ్రామాల్లో పొలాలు నీట మునిగాయి. విజయవాడ కృష్ణలంక పరిధిలో పలు ఇళ్లలోకి నీరు చేరింది.
ఇవీ చదవండి