ప్రకాశం జిల్లాలో విద్యుత్ ప్రమాదాల కారణంగా నాలుగు సంవత్సరాల్లో 108 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇందులో విద్యుత్ సిబ్బంది కూడా ఉండటం విస్మయానికి గురిచేస్తోంది. 191 మూగజీవాలు మృతిచెందాయి. చాలా మంది గాయాలపాలయ్యారు. అధికారికంగా ఈ గణాంకాలు కనిపిస్తున్నప్పటికీ వాస్తవంగా ఈ సంఖ్య మరింత ఎక్కువే. విద్యుత్ శాఖలోని నిబంధనలను వందశాతం అమలు అయ్యేలా చూడటం, ప్రజలకు అవగాహన కల్పించడం ద్వారా మానవ తప్పిదాలతో సంభనించే ప్రమాదాలను, ప్రాణనష్టాన్ని నివారించవచ్చు.
జిల్లాలో విద్యుత్ ప్రమాదాలు మార్కాపురం, కనిగిరి, గిద్దలూరు, పర్చూరు తదితర ప్రాంతాల్లో ఎక్కువగా చోటుచేసుకుంటున్నాయి. ఇందులో ముఖ్యంగా పంట పొలాల వద్ద సర్వీసు వైరు అందేంత ఎత్తులో ఉండి విద్యుత్ షాట్ సర్యూట్ అవడం, సమయానికి ట్రాన్స్కో ఆధికారులు, సిబ్బంది స్పందించకపోవడం, విద్యుత్ సమస్యలకు ప్రైవేటు వ్యక్తులతో మరమ్మతులు చేయించడం, పొలాల వద్ద ఏర్పాటు చేస్తున్న విద్యుత్ కంచెలు, గాలివానలు, ప్రకృతి వైపరిత్యాలు వంటివి విద్యుత్ ప్రమాదాలకు కారణాలవుతున్నాయి.
తర్లుపాడులో...
తర్లుపాడు మండలం రోలుగండపాడు గ్రామానికి చెందిన రామకృష్ణారెడ్డి తనకున్న మూడు ఎకరాల పొలంలో మిరప సాగుచేశాడు. మూడురోజుల కీత్రం పొలానికి నీళ్లు పెట్టడానికి వెళ్లి విద్యుదాఘాతానికి గురై మృతి చెందారు. బోరుకు సంబంధించి ప్యానల్ స్విచ్ వేస్తుండగా ప్రమాదం జరిగింది. కేకలు వేస్తూ అక్కడే పడిమృతి చెందాడు. పొలాన్ని నమ్ముకునే అదే లోకంగా బతికిన ఆయన పొలం వద్దనే ప్రాణాలు కోల్పోవడం అందరినీ కలచివేసింది.
మార్టురులో...
" దసరా రోజున మార్టూరు వద్ద నిత్యం రద్దీగా ఉండే 16వ నెంబరు జాతీయ రహదారిపై హైవే అధికారులు ఏర్పాటు చేసిన విద్యుత్ స్తంభం, దానికి ఏర్పాటు చేసిన ఫ్లెక్సీతోపాటు దారికి అడ్డంగా కూలిపడింది. ఆ సమయంలో అక్కడ రాకపోకలు లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. ఐదు రోజుల క్రితం యుద్దనపూడిలో ఆభిమాన నటుడి పుట్టినరోజు సందర్భంగా ఫ్లెక్సీ కడుతూ సుగుణారావు ఆనే అభిమాని మృతిచెందగా, మరో ముగ్గురు గాయాలపాలయ్యారు. వారిని గుంటూరు ఆస్పత్రికి తరలించారు. నిరుపేద యువకులు ఇలా ప్రమాదానికి గురికావడం ఆ కాలనీ లో విషాదం నింపింది.
సంతమాగులూరులో...
2019 ఆగష్టులో జిల్లాలోని సంతమాగులూరు మండలంలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ తో ముగ్గురు చిన్నారులు బలయ్యారు. స్వాతంత్ర దినోత్సవానికి ముందురోజు ఒక పార్టీ జెండా పోల్ కు సర్వీసు వైరు తగిలి విద్యుత్ ప్రవహించడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటన ఆ కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని నింపింది
ప్రమాదాల నివారణకు చర్యలు...
"2020ని ప్రమాదరహిత సంవత్సరంగా విద్యుత్శాఖ ప్రకటించిందని. ఆ మేరకు విద్యుత్ ప్రమాదాలను నివారించడానికి చర్యలు తీసుకుంటున్నట్లు విద్యుత్ శాఖ ఎస్ఈ ఎం శివప్రసాద్రెడ్డి తెలిపారు . నిబంధనలకు అనుగుణంగా విద్యుత్ సిబ్బంది, అధికారులు సత్వర చర్యలతో ప్రమాదాలు జరగకుండా విధులు నిర్వహించాలని ఆదేశించినట్లు స్పష్టం చేశారు. ప్రజలతోపాటు విద్యుత్ శాఖ సిబ్బందికి జాగ్రత్తలు సూచిస్తు..పెద్దసంఖ్యలో కరపత్రాలను పంపిణీతో.. అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నామని ఆయన అన్నారు. విద్యుత్ ప్రమాదాలను పరిశీలించి అర్హులైన కుటుంబాంకు నష్టపరిహారం అందజేస్తున్నట్లు ఆయన తెలిపారు
ఇదీ చదవండి